పెళ్లి మెను : భారీ విందు ఇవ్వలేం.. ఒక కూర.. ఒక స్వీటు.. పెద్దల తీర్పు..!
ముఖ్యంగా పెళ్లిల్లు, పంక్షన్ లలో పెట్టే ఖర్చు తలకు మంచిన భారం అవుతుందని మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పుట్టిన రోజు లాంటి చిన్న చిన్న వేడుకలకే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పెళ్లిళ్లకయ్యే ఖర్చు తలచుకుంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తలకు మించిన భారం అవుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ముస్లింల ఇండ్లలో జరిగే పెళ్లి అంటే ఆర్థికంగా భారమే అంటూ వాపోతున్నారు. తినుబండారాలు, కూరలు, వంటలు ఇలా ఎక్కువగా ఖర్చు చేయడంతో వివాహ విందు ఖర్చు పెరిగిపోతోందని.. ఆడపిల్ల తరుపు కుటుంబాలు వాపోతున్నాయి.
దీంతో ఆడపిల్లల కుటుంబాల కష్టాలను తీర్చడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ పట్టణంలోని మతపెద్దలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక నుంచి వేములవాడ పట్టణంలో జరిగే ఎవరి పెళ్లికి అయినా.. ఒకటే కూర.. ఒకే స్వీటు.. ఉండాలని తీర్మానం చేసారు.
సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో అమ్మాయి తరుపు ఫ్యామిలీ పెళ్లి వేడుక సమయంలో చికెన్, మటన్తో సహా వివిధ రకాల వంటలు చేసి పెట్టాల్సి వస్తుంది. బిర్యాని, చపాతి, రోటి కుర్బాని కా మీటా, ఖద్దూ కాకీర్, ఐస్ క్రీమ్, షేమియా షీర్ కుర్మా, ఇలా అనేక రకాల వంటకాలను విందు భోజనంలో ఏర్పాటు చేస్తుంటారు. అయితే కరోనా వైరస్ తరువాత ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి చిన్నభిన్నం కావడంతో.. వ్యాపారాలు సరిగ్గా జరగకపోవడంతో నష్టాలు చవిచూశారు. దీంతో గతంలో ఏర్పాటు చేసిన విధంగా విందు భోజనం ఏర్పాటు చేయడం కష్టంగా మారింది.
ముఖ్యంగా ఆడపిల్లకు ఇచ్చే కట్న కానుకలతో పాటు విందు భోజనానికి అయ్యే ఖర్చులను పేద, మధ్య తరగతి వారు తట్టుకోలేకనే కొందరు మత పెద్దలకు ఫిర్యాదు చేసారు. విందులో ఎంత తక్కువలో వెరైటీలు వడ్డించినా.. ఆ వెరైటీలు ఖర్చు భారీగానే అవుతుందని.. తాము ఈ భారాన్ని భరించలేని స్థితిలో ఉన్నాం అంటూ మమ్మల్ని ఒడ్డుకు చేర్చండంటూ పేద, సామాన్య కుటుంబాలు విజ్ఞప్తి చేసారు. పెళ్లిలో పెరుగుతున్న విందు ఖర్చును నియంత్రించడానికి వేములవాడలోని షాదిఖానాలో 8 మజీద్ కమిటీల పెద్దలు సమావేశమయ్యారు. ఇక నుంచి పట్టణంలో జరిగే పెళ్లిల్ల విందులో భగారాతో పాటు ఒకటే కూర చికెన్ లేదా మటన్ మాత్రమే వడ్డించాలని తీర్మానం చేసారు. ఫిబ్రవరి 01వ తేదీ నుంచి ఈ తీర్మానం అమలులోకి రానుందని పెద్దలు తీర్పు చెప్పారు.