తొలి రోజు పోటీల్లో రష్యా ఆర్చర్ స్విట్లానా గోంబొయివా స్పృహ తప్పి కింద పడిపోవడం ఆందోళన కలిగించింది. వైద్య సిబ్బంది ఆమెకు తక్షణమే చికిత్స చేసి తన గదికి తరలించారు. అంతకుముందు మహిళల సింగిల్స్, టీమ్ ఈవెంట్లో తను పాల్గొని తదుపరి రౌండ్లకు అర్హత సాధించింది. 64 మంది పాల్గొన్న మహిళల ఆర్చరీ సింగిల్స్ అర్హత పోటీల్లో స్విట్లానా 45వ స్థానంలో నిలిచింది. టోక్యోలో భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక స్విట్లానా స్పృహ కోల్పోయింది. ఆమె ఆరోగ్యంగానే ఉంది. తదుపరి రౌండ్ల్లో పాల్గొంటానని స్విట్లానా ఇన్ స్టాలో తెలిపింది. ఎండ తీవ్రత వలనే ఇలా జరిగిందని స్విట్లానా చెప్పింది. ఇంతకుముందు ఎప్పుడు తాను ఇలా కళ్లు తిరిగిపడిపోలేదని..తలకు దెబ్బ కొంచెం బలంగానే తాకింది కానీ, తదుపరి రౌండ్లలో పోటీ పడతానని స్విట్లానా తెలిపింది. ఇకపోతే, సగటున టోక్యోలో 30 డిగ్రీలకు పైబడి ఎండ కాస్తుండడంతో శీతల ప్రాంతాల నుంచి వచ్చిన అథ్లెట్లకు అవస్థలు తప్పడం లేదు. భానుడి ప్రతాపం నుంచి అథ్లెట్లకు ఉపశమనం కలిగించేందుకు నిర్వాహకులు క్రీడా గ్రామంలో ఎయిర్ కూలర్లు వంటివి కూడా ఏర్పాటు చేశారు. ఇక, ప్రస్తుతం టోక్యోలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడంతో మారథాన, రేస్ వాకింగ్ ఈవెంట్లను చల్లగా ఉండే సప్పొరో నగరానికి నిర్వాహకులు మార్చారు.
టోక్యోలో నిరసనలు
ఒలింపిక్స్ను రద్దు చేయాలని టోక్యో మెట్రోపాలిటన ప్రభుత్వ భవనం ముందు 50 మంది నిరసన తెలిపారు. ఒలింపిక్స్ వద్దే వద్దు.. ప్రజల ప్రాణాలను కాపాడండి అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసనకారులు నినాదాలు చేశారు. టోక్యో నగరంలో గురువారం రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగు చూడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఒక్క రోజే టోక్యోలో 1800లకు పైబడి కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు రావడం ఇదే ప్రథమం.