"వరలక్ష్మి వ్రతం" ఎందుకు చేయాలో తెలుసా ?
ఈ ఉపవాసానికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. మగధ దేశంలో కుండి అనే నగరం ఉండేది. చారుమతి అనే పేద మహిళ ఈ నగరంలో నివసించేది. చారుమతి లక్ష్మీదేవికి గొప్ప భక్తురాలు. ఆమె ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవి కోసం ఉపవాసం ఉండేది. భక్తిశ్రద్ధలతో పూజించేది. ఒకసారి లక్ష్మి దేవి చారుమతి కలలోకి వచ్చి శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం వరలక్ష్మి ఉపవాసం ఉంటూ పూజ చేయమని చెప్పింది. ఆ తల్లి ఆజ్ఞలను పాటిస్తూ చారుమతి ఉపవాసం ఉంటుంది. లక్ష్మీదేవి కలలో చెప్పిన నియమాల ప్రకారం పూజించింది. చారుమతి పూజ పూర్తయిన వెంటనే ఆమె శరీరం బంగారు ఆభరణాలతో నిండిపోయింది. ఇల్లు ఆహార ధాన్యాలతో నిండిపోయింది. ఈ విషయం తెలిసిన ఇతర మహిళలు కూడా ఈ ఉపవాసం ఉంటూ లక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం నాడు పూజించడం ప్రారంభించారు. ఆ తరువాత దేశం మొత్తం సిరిసంపదలతో తులతూగింది. లక్ష్మీదేవి అడిగిన భక్తులు అందరికీ వరాలిచ్చింది కాబట్టి అప్పటి నుండి ఈ ఉపవాసం "వరలక్ష్మీ వ్రతం"గా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం మహిళలు ఈ ఉపవాసాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది.