కోహ్లీ సచిన్ ను దాటేస్తాడా.. గంగూలీ ఏమన్నాడంటే?
అవును, తాజాగా దాదాకి చాలా క్లిష్టమైన ప్రశ్న ఎదురైంది. సచిన్ రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తాడా? అన్నదే ఆ ప్రశ్న. కాగా ఈ ఆసక్తికర చర్చపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనదైన రీతిలో చాలా ఆసక్తికరమైన సమాధానం ఇవ్వడం కొసమెరుపు. విషయం ఏమంటే శ్రీలంకతో మొదటి వన్డేలో మరో సచిన్ రికార్డును కోహ్లి సమం చేసిన నేపథ్యంలో మరోసారి ఈ చర్చ జోరుగా జరుగుతోంది. సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ గాడ్గా పేరుగాంచిన మాస్టర్ రికార్డులను బ్రేక్ చేయడం అసాధ్యమన్న వాదన చాలా రోజులుగా ఉంది.
అయితే క్రికెట్లో రికార్డులు ఉన్నవి బ్రేక్ చేయడానికే అన్నట్లుగా విరాట్ కోహ్లి మొదటి నుండి చెలరేగి పోయి ఆడటం అందరికీ తెలిసినదే. తాజాగా అతడు వన్డేల్లో 45వ సెంచరీ సాధించాడు. దాదాపు మూడు సంవత్సరాలుగా సెంచరీ కోసం ఎదురు చూసిన కోహ్లీ వరుసగా రెండు వన్డేల్లో రెండు సెంచరీలతో తెగబడిన సంగతి అందరికీ తెలిసినదే. దీంతో మరోసారి మాస్టర్ రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తాడా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డుకు కోహ్లి చేరువగా రావడం ఇలాంటి ఊహలకు మరోసారి రెక్కలొచ్చాయి.
ఇకపోతే సదరు ప్రశ్నకు దాదా స్పందిస్తూ... "ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. కోహ్లి అద్భుతమైన ప్లేయర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇలాంటి ఇన్నింగ్స్ అతగాడు ఎన్నో ఆడాడు. 45 సెంచరీలు చేయడమంటే మామ్మూలు విషయం కాదు. అతని దగ్గర చాలా ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. కొన్నిసార్లు అతడు పరుగులు సాధించకపోవచ్చు గాక, కానీ అతడో ప్రత్యేకమైన ప్లేయర్" అని గంగూలీ అన్నాడు. టెండూల్కర్ వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. కోహ్లీ గనుక వన్డేల్లో మరో నాలుగు సెంచరీలు చేస్తే సచిన్ను సమం చేస్తాడు.