నీలో రాక్షసుడిని.. పెంచకు.. అదే విజయదశమి..!
అయితే నేటి సమాజంలో ఈ సాంప్రదాయాలు, పండుగలు కేవలం సెలువు దినాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. పండగ అంటే దైవానికి కాస్త సమయం కేటాయించి, మనకు ఇన్ని ఇచ్చిన ఆయన ఉదార హృదయానికి తనివితీరా కృతఙ్ఞతలు చెప్పడానికే అనేది శాస్త్రం మాట. కానీ ఇప్పటి లోకంలో అలాంటివి చాలా తగ్గిపోతున్నాయి. ఏదో సంస్కృతి నచ్చిన మానవుడు తన ధర్మాన్ని మరిచిపోయి అత్యాశకు గురవుతున్నాడు. అందుకే మనిషిలో రానురాను మానవత్వం తగ్గిపోతుంది. మానవత్వం లేకపోతే మనిషికి ఇతర ప్రాణులకూ తేడా లేదు. అందుకే ఆ స్థితికి మనిషి అనే ఉత్తమ ప్రాణి దిగజారకుండా అనేక సంస్కృతుల పేరిట అతని మనసును దైవం వైపు మళ్లించేందుకే ఏర్పాటు చేశారు.
నేడు అలాంటివి పాటించే వారు తక్కువ లేదా అతివిశ్వాసంతో లేదా భయంతోనో దైవాన్ని సందర్శిస్తున్నారు తప్ప, అతనే మనిషి సహా అన్నిటికీ తల్లితండ్రి అనే విషయం మరిచిపోతున్నారు. మనిషి సంకల్పం చేత దైవానికంటే ఒక మెట్టు పైన ఉండొచ్చు అనేది శాస్త్రాలలో మాట. అలా ఉండటం తరువాత సంగతి, కనీసం మనిషి మనిషిగా కూడా ఉండటం లేదు. అందుకే ఎప్పటికి గతించి పోకుండా శాశ్వతంగా ఉండే నియమాలు, నిబంధనలు రూపంలో ఆయా ధర్మగ్రందాలలో సాంప్రదాయాలను పొందుపరిచారు. వాటిని పాటిస్తూ మనిషి జీవనం గడపాల్సి ఉంటుంది. అప్పుడే మనిషి అనుకున్నది సాధించగలడు.