ఊహించని కేబినెట్.. చంద్రబాబు అంతుచిక్కని గేమ్ మొదలెట్టాడా...?
- యనమల, పరిటాల కుటుంబాలకు నో ఛాన్స్
- పయ్యావుల, గొట్టిపాటి లాంటి ఫైర్బ్రాండ్లకు చోటు
- మొహమాటాలకు పోని బాబు...!
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
చంద్రబాబు తన కేబినెట్ను సిద్ధం చేసుకున్నారు. అయితే.. గతానికి భిన్నంగా ఈ సారి ఆయన ఎవరూ ఊహించని విధంగా పదవులు ఇచ్చారు. చంద్రబాబు కేబినెట్ అంటే.. కొన్ని ముఖాలకు తప్పని సరిగా సీటు ఖాయం అనే ముద్రను తుడిచేశారు. ఎక్కడా మొహమాటాలకు చోటు పెట్టకుండా.. చంద్రబాబు తన కేబినెట్ను ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి చంద్రబాబు తన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారంటే.. కొన్ని కుటుంబాలకు పెద్దపీట వేస్తారనేది చర్చ.
వీరిలో గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు సహా పరిటాల కుటుంబాలకు ఖచ్చితంగా సీటు ఉంటుందని అందరూ ఊహిస్తారు. కానీ, ఈసారి చంద్రబాబు ఈ బారికేడ్లు తొలగించారు. మొహమాటాలకు చోటు పెట్టకుండా.. టీడీపీలో ఆది నుంచి ఉన్నారన్న సెంటిమెంటును కూడా పక్కన పెట్టి ఆయన వీర విధేయత + కష్టపడే వారికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. మొత్తంగా 25 మంది మంత్రుల్లో కొత్తవారికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. టీడీపీ నుంచి యువతకు ప్రాధాన్యం పెంచారు.
ఎస్సీ, ఎస్టీలలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా చంద్రబాబు మరో ఘనత దక్కించుకున్నారు. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీలలో జగన్ మాత్రమేమంత్రి పదవులు ఇచ్చారన్న వాదనను తాజాగా జరిగిన కేబినెట్ కూర్పుతో చంద్రబాబు తుడిచి పెట్టేశారు. అలానే వైశ్య సామాజిక వర్గానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలోనూ శిద్ధా రాఘవరావుకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు యువ నాయకుడు టీజీ భరత్కు అవకాశం ఇవ్వడం ద్వారా వైశ్య సామాజిక వర్గాన్ని గౌరవించారు.
అదేవిధంగా ఎవరూ ఊహించని విధంగా గొట్టిపాటి రవికుమార్కు అవకాశం ఇచ్చారు. అలానే.. మైనారిటీ ల లో ఫరూక్కు ఛాన్స్ ఇచ్చారు. ఈ రెండు కూడా.. ఎవరూ ఊహించని పదవులే కావడం గమనార్హం. గతంలో మైనారిటీలకు అవకాశం ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు మాత్రం చోటు కల్పించారు. ఇక, పార్టీ మారి టీడీపీలోకి వచ్చినా నిబద్ధతతో వ్యవహరించిన గొట్టిపాటికి కేబినెట్లో చోటు ఇచ్చారు. ఇది చంద్రబాబు మార్కు పనితీరుకు నిదర్శంగా ఉంది.
రెడ్డి సామాజిక వర్గంలో ఖచ్చితంగా సీటు ఖాయమని అనుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి చంద్రబా బు ఈ సారి చోటు దక్కలేదు. ఇదేసమయంలో నెల్లూరు నుంచి సీనియర్ నాయకుడు ఆనం రామనారా యణరెడ్డికి, అనంపురం నుంచి పయ్యావుల కేశవ్కు చంద్రబాబు చోటు కల్పించారు.అదేవిధంగా కడపకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. రాయచోటి నుంచి విజయం దక్కించుకున్న మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. ఇలా.. చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా మార్పులు కూర్పులు చేయడంతో కేబినెట్ సమతూకం పాటించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.