నాలుగోసారి చంద్రబాబు: జాలి కాదు.. జన జాగృతి..!
- ఏపీ దశ మారుస్తారన్న ఆలోచనతో ప్రజలిచ్చిన గొప్ప విజయం ఇది
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ ఘడియలివి. ఈ రికార్డును ఆయన అన్న ఎన్టీఆర్కు సమం చేయొచ్చు. కానీ... సమీపభవిష్యత్తులో ఎవరూ సమం చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే.. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. విభజిత ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రజలు ఆయనకు జాలిపడి పదవిని కట్టబెట్టారనే చర్చ తెరమీదికి వచ్చింది. ఆయనను అరెస్టు చేయడం నుంచి ఆయన కుటుంబాన్ని దూషించిన దరిమిలా ప్రజా తీర్పు ఇలానే వచ్చిందని అనే ప్రబుద్ధులు వున్నారు.
అయితే.. ఇప్పుడు చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన తీర్పు జాలి పడి ఇచ్చింది కాదు.. జన జాగృతి నుంచి పుట్టుకొచ్చిన సంచలన తీర్పు. ప్రజా విజయంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు కనుక తప్పు చేస్తే.. ఇక, ఏపీకి దశ - దిశ ఉండబోదనే సమున్నత రీతిలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇచ్చిన తీర్పు ఇది. దీనిని ఈ కోణంలో చూడాలి రాజధాని లేని రాష్ట్రంగా.. నిరుద్యోగం పెరిగిపోయిన రాష్ట్రంగా కునారిల్లుతున్న ఏపీని సరైన దిశలో నడిపిస్తారన్న ఏకైన సమున్నత ఉద్దేశంతో ప్రజలు కూడా చాలా దూర దృష్టితో ఆలోచించి ఇచ్చిన తీర్పు ఇది..!
చంద్రబాబు పాలనలో వ్యక్తిగత ప్రయోజనం కన్నా.. వ్యవస్థీకృత ప్రయోజనానికి పెద్దపీటపడింది. అందు కే ఉద్యోగులకు.. హైదరాబాద్ కేంద్రంగా మారింది. అందుకే.. ఆర్థికంగా హైదరాబాద్ ఎదిగింది. ఇది నిష్టుర సత్యం. ఏదేశ మేగినా..` అన్నట్టుగా తెలుగు వారు ఎక్కడున్నా.. ఏపిని బాగు చేయాలని అనుకున్నారు. అనుకుంటున్నారు కూడా. ఇది చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందన్న ఏకైక నినాదం కూడా వినిపించిం ది. నాడు చూశారు.. నేడు వేశారు.. అన్నట్టుగానే .. చంద్రబాబుపై జాలితో కాదు.. జన జాగృతి కురిపించిన ఓట్ల వర్షంలో ఏపీ తడిచిపోయింది.
ఒక విజయం వ్యక్తిగతంగా ఇచ్చే ఆత్మ సంతృప్తి కన్నా.. వ్యవస్థకు చేసే మేళ్లు ఎక్కువగా ఉంటాయని గ్రహించి ఇచ్చిన విజయంగానే చూడాలి. తాను నమ్మిన సిద్ధాంతం రాష్ట్రానికి మేలు చేస్తుందని భావించిన నాయకుడి వెంటే జనం నడిచారు. తాను నమ్మిన సిద్ధాంతం దేశానికి రాష్ట్రంలోను, రాష్ట్రానికి దేశంలోను పేరు తీసుకువస్తుందని భావించిన నాయకుడి వెంటే జనం ఉన్నారు. ఇదే.. చంద్రబాబుకు ఘన విజయాన్ని కీర్తిని కూడా అందించిందనడంలో సందేహం లేదు.