కాపు కోటలో జనసేన ధర్మరాజు విక్టరీ సీక్రెట్ ఇదేనా...?
- ఉంగుటూరులో 45 వేల కాపు - 12 వేల రాజుల ఓట్లు
- గాజుగ్లాసు పార్టీ గెలవాలంటే టీడీపీ 100 % ఎఫర్ట్ తప్పనిసరి
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఉంగుటూరు ( ఇప్పుడు ఏలూరు జిల్లా) నియోజకవర్గానికి రాజకీయంగా గత కొన్ని దశాబ్దాలుగా ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ నుంచి ఏ పార్టీ తరపున అభ్యర్థి గెలిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు.. 2014 రాష్ట్ర విభజన తర్వాత కావచ్చు.. అదే పార్టీ అధికారంలో ఉండేది. అయితే ఇప్పుడు అనూహ్యంగా సీను మారింది. కూటమిలో భాగంగా ఇక్కడ నుంచి జనసేన పోటీ చేస్తోంది.
వాస్తవంగా ఇక్కడ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరాంజనేయులు పోటీ చేయాల్సి ఉంది. అయితే జనసేన ఈ సీటు తీసుకుంది. పైగా జనసేన పోటీ చేస్తోన్న 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజక వర్గాలలో ఏకైక క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తిగా ధర్మరాజు ఉన్నారు. ఆయనది నియోజకవర్గంలోని నిడమర్రు మండలంలోని పత్తేపురం.
ఉంగుటూరు నియోజకవర్గంలో నిడమర్రు, గణపవరం మండలాల్లో రాజులు ఉంటారు. గణపవరం మండలంలో రాజులదే ఆధిపత్యం. పవన్ కూడా తన పార్టీ తరపున క్షత్రియ వర్గానికి తప్పని సరిగా ఒక సీటు ఇవ్వాలని పట్టుదలతో ఉండడంతో ధర్మరాజుకు సీటు దక్కింది. గత ఎన్నికల్లో ఓడిన ధర్మరాజు ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో పార్టీని బతికించుకున్నారు. పార్టీ కేడర్కు అండగా ఉన్నారు.
ఇక పొత్తులో భాగంగా టీడీపీ వాళ్లు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే గన్నితో పాటు ఆ పార్టీ కేడర్ బాగా కష్టపడుతోంది. ధర్మరాజు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు గన్ని ఫ్యామిలీ అంతా ధర్మరాజు గెలుపు కోసం తిరుగుతున్నారు. టీడీపీ ఫుల్ సపోర్ట్తో ఇక్కడ ధర్మరాజు వైసీపీతో ఢీ అంటే ఢీ కొడుతున్నారు. నియోజకవర్గంలో 45 వేల పై చిలుకు కాపు ఓటర్లు ఉన్నారు. పైగా ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుబాబు కూడా కాపు వర్గమే. మరి కాపులు ఈ సారి జనసేనకు మారతారన్న చర్చలు ఉన్నాయి. ఏదేమైనా కాపుల కోటలో జనసేన నుంచి రాజు ఎమ్మెల్యే అవుతాడా లేదా ? అన్నది చూడాలి.