వైసీపీ లేడీ Vs టీడీపీలో లేడీ పోటీ.. గెలిచేది ఏ పార్టీ లేడీ అంటే...?
- మంత్రి ఉషపై టీడీపీ సవితమ్మ సవాల్
- రాష్ట్రంలోనే ఆసక్తిరేపుతోన్న మహిళా మణుల పోరు
( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్యే భీకర పోరు సాగుతున్న విష యం తెలిసిందే. పలు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఫైట్ ఉంటోంది. ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కీలక నియోజకవర్గాల్లో మహిళలకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి వాటిలో ఉమ్మ డి అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి గత 2019 ఎన్నికల్లో ఇరు పార్టీల నుంచి బలమైన పురుష అభ్యర్థులు పోటీ చేశారు.
2019 ఎన్నికల్లో పెనుకొండ నుంచి వైసీపీ తరఫున మాలగుండ్ల శంకరనారాయణ పోటీ చేశారు. ఈయనకు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీకే పార్థసారథి బరిలో ఉన్నారు. వీరిలో శంకర నారాయణ విజయం దక్కించు కున్నారు. మంత్రి కూడా అయ్యారు. ఇక, ఇప్పుడు వీరిద్దరూ కూడా.. ఎంపీ స్థానాలకు వెళ్లిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి శంకరనారాయణ బరిలో ఉన్నారు. ఇక, బీకే పార్థసారథి.. టీడీపీ తరఫున హిందూపురం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
కట్చేస్తే.. పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి ఇటు వైసీపీ, అటు టీడీపీల నుంచి పోటీలో ఉన్నవారు.. ఇద్దరూ మహిళలే కావడం గమనార్హం. 2004 నుంచి ఇక్కడ జరిగిన ఎన్నికలను గమనిస్తే.. ఒకే ఒక్క సారి ఒకే ఒక్క పార్టీ మహిళకు పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అది కూడా.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. అప్పటి ఎన్నికల్లో గంగుల భానుమతి అనే నాయకురాలికి కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చింది. అయితే.. ఆమె ఓడిపోయారు. ఆతర్వాత.. మళ్లీ 20 ఏళ్లకు.. ఇక్కడ నుంచిమహిళలు పోటీలో ఉండడం గమనార్హం.
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి ఉషశ్రీచరణ్ బరిలో ఉన్నారు. ఇక, టీడీపీ నుంచి సోమందే పల్లి సవితమ్మ పోటీ చేస్తున్నారు. ఇద్దరూ కూడా బలమైన నాయకులు కావడం.. పైగా విస్తృత ప్రజాభిమానం.. ఆర్థిక బలం ఉన్న మహిళలే కావడం గమనార్హం. అయితే.. ఉష శ్రీచరణ్.. కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ బరిలో ఉన్నారు. అంతకుమించి ఆమె మంత్రి కావడం.. స్థానిక నాయకులపై పట్టుపెంచుకోవడం వంటివి మాత్రం వైసీపీకి బలం చేకూరుస్తున్నాయి. మరి ఏ మహిళ ఇక్కడ జెండా ఎగరేస్తారో చూడాలి.