అమరావతి: కాంగ్రెస్లోకి దేవినేని ఉమా... గేమ్ మొదలైంది...!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సూచన మేరకు కీలక నేతలు రంగంలోకి దిగి దేవినేనితో చర్చలు జరుపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన పార్టీలోకి చేరితే మైలవరం టికెట్నే ఆయనకు ఆఫర్ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో దేవినేని స్పష్టత ఇచ్చే అవకాశముంది. దేవినేని ఉమా టీడీపీలో సీనియర్ నేత. గత ప్రభుత్వ హయంలో మంత్రిగా కూడా పని చేశారు. గడిచిన ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని తన ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్పై ఓటమి చెందారు. ఓటమి పాలైనప్పటికీ రాజకీయంగా యాక్టివ్గానే ఉమా ఉన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో తనపై గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్పైనా అంతే స్థాయిలో విమర్శలు గుప్పించారు. వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగానూ పలుమార్లు విమర్శలు చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో గెల్చిన మైలవరం టికెట్ను పొందారు. ఇదే ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఆగ్రహానికి కారణమైంది. పార్టీలో సీనియర్ నేతగా, అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే తనకే టికెట్ కేటాయించకపోవడం పట్ల దేవినేని అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకానొక దశలో పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. మళ్లీ వెనక్కి తగ్గారు. కానీ, పార్టీ మార్పుపై ఆయన పునరాలోచిస్తున్నట్టు తెలిసింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చర్చలకు కారణమైనట్టు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమాను అత్యంత రహస్యంగా విజయవాడకు శివారులోని ఓ రిసార్టులో కలుసుకున్నారని తెలిసింది.
ఈ క్రమంలో వారు రెండు ఆఫర్లు ఇచ్చారని చెబుతున్నారు. ప్రచార ఖర్చులు భరించడంతోపాటు.. పార్టీ మైలవరం టికెట్ను కూడా ఆయనకు ఇచ్చే ప్రతిపాదనను ముందుకు తెచ్చారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ నేతకు దేవినేని సన్నిహితంగా ఉంటారు. సదరు నేత ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఈ చర్చలను సాగిస్తున్నట్లు సమాచారం.