పాట్నా : మోడీకి ఊహించని షాక్..లెక్క సరిపోతుందా ?

Vijaya






నిజంగా నరేంద్రమోడీకి ఇది ఊహించని షాకనే చెప్పాలి.  ఏక్ నాథ్ షిండేని అడ్డం పెట్టుకుని మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసిన బీజేపీకి ఇది దిమ్మతిరిగే షాకే. బీహార్లో అధికారంలో ఉన్న  జెడీయూ+బీజేపీ విడిపోతున్నట్లే. ఇదే జరిగితే బీజేపీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సుంటుంది. ఒక్కసారిగా ఎన్డీయే భాగస్వామిగా, బీహార్లో అధికారంలో ఉన్న జేడీయు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది ? ఎందుకంటే మెల్లిగా ఇతర రాష్ట్రాల్లోని జేడీయూ ఎంఎల్ఏలను బీజేపీ చీల్చేస్తోంది.



ఇతర రాష్ట్రాల్లో జేడీయూలో చీలికలు తీసుకొచ్చి కొందరు ఎంఎల్ఏలను తనలో కలిపేసుకుంటోంది. మేఘాలయాలో ఆమధ్య ఏడుగురు ఎంఎల్ఏల్లో చీలిక తీసుకొచ్చి ఆరుగురిని బీజేపీలో కలిపేసుకున్నారు. అప్పటినుండి బీజేపీ-జేడీయూ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య గొడవలు అవుతునే ఉన్నాయి. తాజాగా ఏకంగా బీహార్లోనే జేడీయు ఎంఎల్ఏల్లో చిచ్చుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నదట. మిత్రపక్షంగా ఉండి మిత్రధర్మాన్ని పాటించని బీజీపీకి బుద్ధిచెప్పాలని నితీష్ అనుకున్నారు.




అందుకనే హఠాత్తుగా ఆదివారం రాత్రి కాంగ్రెస్ చీఫ్ సోనియాతో మాట్లాడారు. అలాగే సోమవారం ఉదయం ఆర్జేడీ చీఫ్ తేజస్వీయాదవ్ తో కూడా ఫోన్లో మాట్లాడారు. వెంటనే కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు తమ ఎంఎల్ఏలను పాట్నాకు వచ్చేయాలని ఆదేశించారు. దాంతో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలతో బీజేపీకి అలర్టయిపోయింది. మంగళవారం తన పార్టీ ఎంఎల్ఏలు, ఎంపీలతో నితీష్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పటికే మీటింగ్ అజెండా అందరికీ చేరుకున్నదట. ఇక్కడ రెండే మార్గాలున్నట్లు నితీష్ చెప్పారట.




మొదటిదేమో ప్రభుత్వాన్ని రద్దుచేసుకుని మధ్యంతర ఎన్నికలకు వెళ్ళటం. రెండోదేమో బీజేపీని వదిలేసి ఆర్జేడీ+కాంగ్రెస్ తో జట్టుకట్టడం. ఫోన్లో ఎంఎల్ఏలతో మాట్లాడినపుడు అందరు రెండో ఆప్షన్ వైపే మొగ్గుచూపారట. దాంతో మంగళవారం సమావేశంలో లాంఛనంగా నిర్ణయం తీసుకుని బీజేపీని తరిమేయటం ఖాయమనే అనిపిస్తోంది. వెంటనే ఆర్జేడీ+కాంగ్రెస్ తో చేతులు కలిపి సంకీర్ణప్రభుత్వానికి నితీష్ రెడీ అవుతున్నారు. 243 మంది  ఎంఎల్ఏల్లో ఆర్జేడీకి 80, బీజేపీకి 77, జేడీయూకి 45, కాంగ్రెస్ కు 19, వామపక్షాలకు 16 మంది ఎంఎల్ఏలున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎంఎల్ఏలుండాలి. కాబట్టి ఆర్జేడీయు, జేడీయూ, కాంగ్రెస్ కలిస్తే మోడీకి షాకే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: