ఆ రెండుచోట్ల ఫ్యాన్‌కు సైకిల్ బ్రేకులు?

M N Amaleswara rao
రాష్ట్రంలో వైసీపీ హవా తగ్గుతూ వస్తుంది...గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఫ్యాన్ గాలి రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. కానీ ఇప్పుడు ఫ్యాన్ గాలి తగ్గుతుంది. అనూహ్యంగా చాలా నియోజకవర్గాల్లో ఫ్యాన్ రివర్స్ అవుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కావొచ్చు...టీడీపీ నేతలు పుంజుకోవడం కావొచ్చు..అలాగే జగన్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉండటం కావొచ్చు..ఈ పరిణామాలు టోటల్‌గా వైసీపీకి మైనస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు నియోజవర్గాల్లో టీడీపీకి అనుకూలంగా పరిస్తితులు మారుతున్నాయి.
ముఖ్యంగా బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గాలి బలంగా వీచేలా ఉంది. ఇక్కడ పార్లమెంట్ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన సీట్లలో కూడా టీడీపీ వేగంగా పికప్ అయింది.
బాపట్లలో ఎస్సీ రిజర్వడ్ స్థానాలుగా ఉన్న వేమూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో టీడీపీ హవా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వేమూరులో వైసీపీ నుంచి మేరుగు నాగార్జున విజయం సాధించారు. అయితే రెండున్నర ఏళ్లలోనే ఆయన ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. పైగా పలు వివాదాల్లో కూడా ఉన్నారు. దీంతో ఆయనపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పికప్ అయ్యారు. మొదట నుంచి పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తున్న నక్కా...నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకున్నారు. దీంతో వేమూరులో టీడీపీ లైన్‌లోకి వచ్చింది.
అటు టీడీపీకి అంతగా కలిసిరాని సంతనూతలపాడులో కూడా సీన్ మారింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు పరిస్తితి అంత బాగోలేదు. ఈయన పనితీరుకు మైనస్ మార్కులే పడుతున్నాయి. అలాగే ఇక్కడ టీడీపీ నేత బి‌ఎన్ విజయ్ కుమార్ దూకుడుగా పనిచేస్తున్నారు. వరుసపెట్టి వైసీపీ కార్యకర్తలని టీడీపీలో చేరుస్తున్నారు. మొత్తానికైతే ఈ సారి ఈ రెండు నియోజకవర్గాల్లో ఫ్యాన్‌కు సైకిల్ బ్రేకులు వేయడం ఖాయమనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: