శుభవార్త : మరో చట్టం రూపకల్పనలో కేసీఆర్ ! అంతా బడి మంచికే!
అయినా సరే యాజమాన్యాలు కాసుల కక్కుర్తిని వీడడం లేదు. లాక్డౌన్ వేళల్లో తమ దగ్గర పనిచేసిన ఉపాధ్యాయులను,చిరుద్యోగులను ఆదుకోకపోగా,ఆన్లైన్ క్లాసుల పేరిట ఫీజులు మాత్రం దండీగా దండుకున్నారు.పోనీ అలా వసూలు చేసిన డబ్బులలో కొంతయినా ఆఫ్ సేలరీల పేరిట అందరికీ చెల్లించారా అంటే అదీ లేదు.ఈ నేపథ్యంలో యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.ఆఖరికి ముఖ్యమంత్రే కాస్త చొరవ తీసుకుని ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రెండు వేల రూపాయల చొప్పున నగదు,నిత్యావసర సరకులు అందించేందుకు ఏర్పాటు చేశారు.ఈ ప్రక్రియ పూర్తిగా కొనసాగక పోయినా కాస్తోకూస్తో కొందరికి అయినా ఆదరువు అయింది.ఇంతగా యాజమాన్యాలు తమ ధోరణి తమదే అన్న విధంగా ఉంటూ ఫీజులు గుంజుకుంటున్న వైఖరిపై త్వరలో కేసీఆర్ సర్కారు కొరడా ఝుళిపించడం ఖాయం.
ఈ తరుణంలో/ఈ నేపథ్యంలో ...ఫీజుల నియంత్రణకు సంబంధించి కొత్త చట్టం ఒకటి తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.ఈ మేరకు ఓ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. వీరి ఆధ్వర్యంలోనే ఫీజులు ఎంత ఉండాలి అన్నది నిర్ణయం కానుంది. కేజీ టు పీజీ ఇప్పటికే చదువు అత్యంత భారంగా మారిపోతున్న తరుణాన కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు వెలువరించనున్నారు అన్నది ఓ పెద్ద సస్పెన్స్ గా ఉంది.ఎందుకంటే ఫీజులకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఓ శ్లాబ్ సిస్టంను ఎనౌన్స్ చేసినా ఎక్కడా అమలు కాని దాఖలా అయితే ఉంది. ఇదేవిధంగా రేపటి వేళ తెలంగాణలో జరగనుందా? లేదా కేసీఆర్ తనదైన పట్టుదలతో తాను చెప్పిన విధంగానే ప్రయివేటు,కార్పొరేటు విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేయాలని చెప్పగలరా..చెప్పాక తన మాట నెగ్గించుకోగలరా అన్నదే ఇప్పుడిక చర్చనీయాంశంగా ఉంది.