చంద్రబాబు ఎందుకు ఇలా చేశారు.... టిడిపిలో హాట్ టాపిక్..!
గత సంవత్సరం కూడా నారా నందమూరి కుటుంబాలు ఈ పండుగను జరుపుకున్నాయి. అయితే ఈ సంవత్సరం మాత్రం వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ విషయం టిడిపి నాయకులను పార్టీ అభిమానులు ఆలోచనకు గురిచేసింది. వాస్తవానికి చంద్రబాబు వస్తారని స్థానికంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు సంక్రాంతి వేడుకలను రద్దు చేసుకున్నారు. ఈ విషయం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గడచిన సంవత్సరం అంతా టిడిపికి గడ్డురోజులు అనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికలు పార్టీకి పరాజయాన్ని మిగిల్చాయి.
దీంతో ఈ సంవత్సరమైనా పార్టీని పరుగులు పెట్టించిన నాయకులు భావిస్తున్నారు. అయితే. ఇప్పటివరకు చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి వేడుకలకు దూరం కావడం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ఒకింత నిరుత్సాహానికి గురి చేసింది. దీనికి కారణం ఏంటి..? అని నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. పైగా.. జగన్ సర్కారు అన్ని ధరలను పెంచేసిందని.. దీనికి నిరసనగానే చంద్రబాబు సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్నారని కొందరు చెబుతున్నారు.
ఇక, పార్టీ పరంగా చూసుకుంటే.. కుప్పంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఇక్కడ నాయకుల మధ్య సఖ్యత లేదని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. అదేసమయంలో కీలక నేతలను పార్టీ నుంచి సాగనంపాలని కూడా ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కీలక నేతలను దూరం చేస్తున్న సమయంలో కుప్పంలో పండగ నిర్వహించుకోవడం ఎందుకు? అని బాబు అనుకుని ఉంటారని మరికొందరు అంటున్నారు. పైగా.. మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీలో వాతావరణం స్తబ్దుగా ఉంది.
ఈ నేపథ్యంలో పార్టీని ముందు సంస్కరించి.. తర్వాత.. సంబరాలు చేసుకుంటే బెటర్! అనే ఆలోచనలో బాబు ఉన్నారని కొందరు అంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వేడుకలకు దూరంగాఉన్నారని చెబుతున్నారు. ఇక, ఏటా బావ గారింట్లో పండుగ చేసుకునే నందమూరి బాలకృష్ణ.. ఈ దఫా అక్క అయిన.. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో కుటుంబ సమేతంగా సందడి చేయడం గమనార్హం.