ఒమిక్రాన్ : ఆ మంత్రి వేడుకల్లో కనిపించని మాస్క్ ఎందుకని?
సంక్రాంతి వేడుకలను ఘనంగా జరపాలన్న ఆలోచనతో పల్లెలన్నీ సమాయత్తం అయ్యాయి.అదేవిధంగా నగరం నుంచి పల్లెకు చేరుకున్న వారంతా సొంత ఊళ్లో సంబరాలు చేసుకున్నారు.కొత్త బట్టలు,పిండివంటలు అన్నవి సందడి చేశాయి.ఊళ్లోకి వచ్చిన పిల్లాపాపలతో అమ్మమ్మలూ,తాతయ్యాలూ ఎంతో ఆనంద పడ్డారు.ఊరి నుంచి వచ్చాక ఆ సంగతులే జ్ఞాపకాలు.నగరం చేరుకున్నాక పల్లె సంగతే మరో ఆనంద కారకం.ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మన తూర్పుగోదావరి జిల్లా,రామచంద్రాపురంలో జరిగిన వేడుకల్లో మాత్రం ఎక్కడా కరోనా నిబంధనలే పాటించ లేదు.ముఖ్యంగా చెల్లుబోయిన వేణు (బీసీ శాఖ మంత్రి) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో కూడా కొందరే మాస్కులు పెట్టుకున్నారు..కొందరు పెట్టుకోలేదు. ఓ వైపు కరోనా ఉద్ధృతి ఊహించని రీతిలో ఉన్నా కూడా మంత్రి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మాత్రం మాస్క్ ల అవసరమే కొందరికి గుర్తుకు రాకపోవడం విడ్డూరం.
మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ విధించేందుకు సైతం వెనుకాడని వేళ ఈ విధంగా సాక్షాత్తూ ఓ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లోనే కొందరు నిబంధనలకు తిలోదకాలివ్వడం పై చర్చ నడుస్తోంది.రామచంద్రాపురంలో ఆయన నిర్విరామంగా మూడు రోజుల పాటు వేణు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఎక్కడెక్కడి నుంచి కళాకారులను తీసుకు వచ్చి సంక్రాంతి గొప్పదనం చాటారు.ఇదంతా బాగానే ఉన్నా కరోనా నిబంధనలు మాత్రం కొందరు పాటించకపోవడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇక్కడనే కాదు పల్లెల్లో జరిగిన ఏ వేడుకలోనూ కరోనా నిబంధనల పాటింపు లేనేలేదు. మాస్క్ సంగతి మరిచే పోయారు.కరోనా ఉద్ధృతిని నియంత్రించేందుకు ఓ వైపు ప్రభుత్వం నానా కష్టాలూ ఎదుర్కొంటుంటే మరోవైపు కొందరి బాధ్యతా రాహిత్యం కారణంగా నివారణ చర్యలేవీ సత్ఫలితాలు ఇచ్చేలా లేవు.