చంద్రబాబుకు మరో కోడెల దొరికేశాడు కానీ?
చంద్రబాబుకు పల్నాడు ప్రాంతం ఇప్పుడొక కీలకంగా మారింది.ఇక్కడ రాజకీయాల్లో పట్టు సాధించి,తన వారి గెలుపునకు ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు.వైసీపీ తరఫు నుంచి బలమైన గొంతుకగా ఇక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.నరసరావు పేట నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. ఆయనకు దీటుగా రాజకీయం నడపడం ఇప్పుడొక సవాలుగా మారింది టీడీపీకి. గతంలో మాదిరిగా కాకుండా వైసీపీ దిగువ స్థాయిలో మంచి పట్టు పెంచుకుంది.టీడీపీ వీరిని ఢీ కొనడంలో విఫలం అవుతోంది. ఇప్పుడు నెలకొన్న వివాదాలు అన్నీ అంత వేగంగా తేలేవి కావు. పల్నాడులో చంద్రబాబు తిష్ట వేసుకుని కూర్చొన్నా సమస్యలు అంత వేగంగా పరిష్కారం కావు.
ఈ నేపథ్యంలో ఈ తరుణంలో..పల్నాడు రాజకీయాల్లోకి చంద్రబాబు ఎంటర్ అవుతున్నారు.ఇప్పటిదాకా ఓ లెక్క ఇక నుంచి మరో లెక్క అన్న విధంగా ఆయన రాజకీయం చేస్తున్నారు.గుంటూరు జిల్లా నరసరావు పేటలో నిన్నటి వేళ జరిగిన ఉద్రిక్తతల్లో అక్కడ టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద రావు అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆయనను స్థానిక ప్రయివేటు ఆస్పత్రి తరలిస్తుండగా, కొందరు దుండగులు సంబంధింత అంబులెన్స్ పై రాళ్ల దాడి చేశారు.ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఇక్కడి రాజకీయాల్లోకి చంద్రబాబు నేరుగా ఎంటరై పోతున్నారు.మొన్నటి వేళ తోట చంద్రయ్య హత్యోదంతం తరువాత అప్రమత్తం అయిన చంద్రబాబు ఏ చిన్న ఘటన జరిగినా ఇటుగానే దృష్టి సారిస్తున్నారు.ఒకప్పుడు నరసరావు పేట అంటే కోడెల శివప్రసాద రావు గుర్తుకు వచ్చేవారు.అంతగా ఆయన ఆ నియోజకవర్గంతో మమేకం అయ్యారు. ఆయన తరువాత నియోజకవర్గంలో కలియదిరుగుతూ కష్టపడుతున్నది చదలవాడే!