కోడి పందేల గెలుపు ఎవరిదో....!
ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందేల కోసం బరులు ఏర్పాటు చేస్తారు. అయితే ఓ వైపు హైకోర్టు హెచ్చరికలు, పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ... ప్రతి ఏటా కోడి పందేలు మాత్రం యదేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కోడి పందేలు, జూదం, పేకాట, గుండాటకు ఎలాంటి అవకాశం లేదని పోలీసులు చెప్పడం... ఆ తర్వాత మళ్లీ జరగడం... ఇదో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి మాత్రం కోడి పందేల్లో కోడికి కత్తి కడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. కత్తి లేకుండా పందేలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా కత్తి కట్టినట్లు తమ దృష్టికి వస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటున్నారు పోలీసులు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ సారి డ్రోన్ కెమెరాల సాయంతో మారు మూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.