కండువాలు మార్చేస్తూ.. ప్రజాసేవ అనడం మనోళ్లకే చెల్లింది..!
సాంప్రదాయంగా వస్తున్న పై పంచ పరువును కూడా ఈ రాజకీయ కండువాలు తీసేయడంతో బహుశా, ఇటీవల పై పంచతో పెద్దగా ఎవరు కనిపించడం లేదు. ఏదో పండగకు కాసేపు అలా వేసుకొని, ఇలా తీసేస్తున్నారు. మళ్ళీ ఏ పార్టీ వాళ్ళో చూస్తే, అదో లేనిపోని గోల. ఒక పార్టీ కండువా వేసుకుంటే ఇంకో పార్టీకి మంట. పధకాలు కూడా దాదాపుగా ఆయా పార్టీ మద్దతు దారులకు తప్ప, అర్హులైన అందరికి ఇచ్చే పార్టీలు తక్కువే. పేరుకే ప్రజాసేవ, లోన జరిగేది అంతా దండుకోవడమే. కార్యకర్త నుండి అతిపెద్ద పదవి లో ఉన్న వాళ్ళ వరకు అంతే. కాకపోతే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా, ఎవరి స్థాయికి బట్టి వాళ్ళు బొక్కుతారు. నొక్కేయడం అయితే ఖచ్చితం, ఎంత అనేది పదవిని, ప్రాజెక్టును బట్టి ఉంటుంది మరి.
ప్రతి నేత మళ్ళీ మాది ప్రజాసేవ చేసే వంశం అని చెప్పుకోవడం అదో విచిత్రం. ఆయనతో పోకుండా, వంశంలో పెద్దలను కూడా ఆ క్షణం తిట్టుకోండి అని సూచన ప్రాయంగా చెప్పినట్టే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజా సేవ పేరుతో దండుకునే విలువ లెక్కలు కడితే, ఆ లెక్కలు చూసి దిమ్మతిరిగిపోతుంది. అది మనోళ్లు చిట్టాలు. నిజంగా సేవ చేసిన నాయకులకు, పోయేప్పుడు కూడా నిలువ నీడ కూడా సరిగా లేకపోయింది. అది ఇవ్వడం అంటే, ప్రజాసేవ అంటే. అలాంటి వారు ఈ నేతల నుండి పుట్టరు, ప్రజల నుండే తయారవ్వాలి. ఒక్కరు కాదు, పంచాయితీ సెక్రెటరీ నుండి ప్రెసిడెంట్ వరకు ఉండాలి. అప్పుడు దేశం బాగుపడుతుంది అని తరువాతి తరాలకు చెప్పినా కాస్త నమ్ముతారు. అలాంటి బాధ్యత 52శాతం ఉన్న యువత ఇంకెప్పుడు తీసుకుంటారో ఏమిటో!