మళ్లీ మొదటికి వచ్చిన పీఆర్సీ వివాదం..!
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ప్రభుత్వం తరఫున కార్యదర్శులు హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా పీఆర్సీ నివేదిక అంశమే మరోసారి ప్రస్తావనకు వచ్చింది. దీనిలో సాంకేతిక అంశాలపై ఇంకా అధ్యయనం చేస్తున్నామని.. క్లారిటీ ఇంకా రాలేదని ఉద్యోగ సంఘాల నేతలకు కార్యదర్శులు వెల్లడించారు. అందువల్ల పీఆర్సీ నివేదిక ఇవ్వలేమన్నారు ప్రభుత్వ కార్యదర్శులు. దీంతో తీవ్ర అసహానానికి గురైన నేతలు.... పీఆర్సీ నివేదిక కూడా ఇవ్వలేనప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఇలాంటి మీటింగ్లు ఎందుకు నిర్వహిస్తున్నారని కూడా ప్రశ్నించారు ఉద్యోగ సంఘాల నేతలు. అసలు నివేదిక ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని నిలదీశారు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. ఇప్పటికే 71 అంశాలతో వినతి పత్రం ఇచ్చామని... కానీ కార్యదర్శుల కమిటీ మాత్రం ఇప్పటికీ కాలయాపన చేస్తూనే ఉందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తేల్చి చెప్పే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని మరోసారి హెచ్చరించారు బండి శ్రీనివాసరావు.