సోమశిల డ్యామ్ కోసం రూ.120కోట్లు : సీఎం జగన్
వేళాంగిణి అనే ఓ మహిళ ఆవేదన విన్న సీఎం జగన్ చలించి.. ఆమె కొడుకుకు ఉద్యోగం కల్పించి ఆదుకుంటాను అని హామీ ఇచ్చారు. బీఎంఆర్ ట్రస్ట్ తరుపున వరద సాయం కోసం రూ. కోటి చెక్కును బీదా మస్తాన్రావు సీఎంకు అందించారు. డీసీఎంఎస్ నిధుల నుంచి రూ.25 లక్షల వరద సాయం చెక్కును చైర్మన్ చలపతి సీఎంకు ఇచ్చారు. అదేవిధంగా వరద పరిస్థితిపై అధికారులతో పూర్తిగా మాట్లాడారు సీఎం. వరద బాధితులకు ఇంటికి రూ.2వేలుతో పాటు రేషన్ కూడా అందించినట్టు గుర్తు చేసారు. ఎవరైనా రాని వాళ్లు ఈనెల 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.
పెన్నానది నుంచి వరద నివారణ కోసం చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. భగత్సింగ్ నగర్ కాలనీలో కోతకు గురైన పెన్నా నదిని సీఎం జగన్ పరిశీలించి.. ముఖ్యంగా కరకట్ట బండ్ నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని ఆ పనులకు శంకుస్థాపన తానే చేస్తానని సీఎం వెల్లడించారు. కొట్టుకుపోయిన సోమశిల డ్యామ్ అఫ్రాన్ నిర్మాణం కోసం రూ.120కోట్లు మంజూరు చేస్తున్నాం అని తెలిపారు. వరద సహాయం అందని వారు ఈనెల 5వ తేదీ ఆదివారం వరకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరదలలో బాధితులను ఆదుకోవడంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగర కమినర్ దినేష్ పని తీరును ప్రశంసించారు సీఎం.
పంటలు, కోతకు గురైన కరట్టను పరిశీలించి ఇక్కడి రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు ముఖ్యమంత్రి. అదేవిధంగా ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొన్న కానిస్టేబుల్ ప్రసాద్ సహా మరో ముగ్గురు పౌరులను అభినందించి.. మెమొంటోలు అందజేసారు సీఎం జగన్. ముఖ్యంగా వరద బాధితులను ఈ ప్రభుత్వం తప్పకుండా అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.