రాజ్యసభలో వైసీపీ ప్రవేటు బిల్లులు...!
విద్యాలయాల్లో నమోదు అయ్యే విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఇందుకోసం విద్యార్థి తల్లి లేదా సంరక్షకునికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఇది విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చి.. దీనిని దేశ వ్యాప్తంగా కూడా కేంద్రం అమలు చేయాలని విజయసాయి రెడ్డి సభలో కోరారు. అదే సమయంలో నిరుద్యోగ భృతి అమలుపై కూడా కీలక బిల్లు ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగులకు భృతి ఓ హక్కు కావాలన్నారు. దేశంలోని 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న గ్యాడ్యుయేట్లు భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ బిల్లును రాజ్యసభలో విజయ సాయిరెడ్డి ప్రవేశపెట్టారు. దీని వల్ల దేశంలోని నిరుద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వెల్లడించారు. ఇక ప్రార్థనా మందిరాలపై దాడుల విషయాన్ని కూడా విజయ సాయిరెడ్డి ప్రస్తావించారు. ప్రార్థనా మందిరాలపై దాడులకు పాల్పడే నిందితులకు కఠిన జైలు శిక్ష విధించాలని కోరుతూ మూడో బిల్లును వైసీపీ ఎంపీ పెద్దల సభలో ప్రవేశపెట్టారు ఈ రోజు. ఈ మూడు బిల్లులపై సోమవారం చర్చ జరిగే అవకాశం ఉంది.