జనసేనలోకి జేడీ రీఎంట్రీ..!
తనకు వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చిందని చెప్పారు. వైసీపీ ఎంపీతో పాటు మరికొందరు నాయకులు తనను కలిసి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టుగా తెలిపారు. అయితే, తాను వైసీపీలోకి రాలేనని చెప్పానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. దీంతో మళ్లీ జనసేనలోకి తిరిగి వెళ్తారా అన్న ప్రశ్నకు జేడీ లక్ష్మీ నారాయణ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జనసేనతో మళ్లీ చర్చలు జరుపుతానని వెల్లడించారు. మళ్లీ వాళ్లు పిలిస్తే వెళ్తానని చెబుతున్నారు. జనసేన పార్టీ విధానాలు నచ్చడం వల్లే ఆ పార్టీలో చేరినట్టు పేర్కొన్నారు.
కొంత కాలంగా దూరంగా ఉన్నా మళ్లీ చేరే అవకాశం ఉన్నట్టు మాట్లాడారు. కానీ, ఏ సమయమో చెప్పలేమని జనసేనలోకి రి ఎంట్రీ గురించి చెప్పారు. గతంలో జనసేనలో చేరిన ఆయన పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ గురించి ప్రశ్నించి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత జనాల్లోకి వెళ్తు సంఘాలను కలుస్తూ జనాలను ఏకం చేసే పనిలో నిమగ్నం అయిపోయారు. ప్రస్తుతం తనకు రెండు పార్టీల నుంచి ఆఫర్ ఉన్నట్టు చెప్పారు జేడీ. కానీ, ప్రస్తుతానికి ఆయనకు ఉన్న ఒకేఒక్క ఛాన్స్ జనసేన మాత్రమే. ఈ క్రమంలో పవన్ పిలిస్తే తాను జనసేనలోకి రీ ఎంట్రీ ఇస్తానని జేడీ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. మరి రానున్న రోజుల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఈ విషయంపై జనసేనాని పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.