బీజేపీ నయా ప్లాన్: గో టూ విలేజ్ 2.0 స్టార్ట్..!
తాజాగా మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలోని నగైఖోంగ్ ఖునౌ ప్రాంతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించారు. మణిపూర్లో గో టూ విలేజ్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది జరిగే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి బీజేపీ ప్లాన్ చేస్తోంది. గోవాలో రెండు రోజుల పర్యటన ముగించుకున్న జేపీ నడ్డా... నేటి నుంచి రెండు రోజుల పాటు మణిపూర్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాబోయే రోజులు పార్టీకి అత్యంత కీలకమైనవని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి కమలం పార్టీ కార్యకర్తలు వెళ్లాలని సూచించారు జేపీ నడ్డా. ప్రజలకు సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం గతంలో ప్రారంభించిన గో టూ విలేజ్ కార్యక్రమం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరే వరకు గో టూ విలేజ్ 2.0 కార్యక్రమం కొనసాగుతుందన్నారు జేపీ నడ్డా.