మోకాళ్ళపై జనం నిరసన.. ఎందుకంటే..?
పెంబి మండలం యాపలగూడ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఊరు నుంచి బయటకు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎప్పటినుంచో అధికారులు, ప్రజాప్రతినిధుల వెంట పడి వినతిపత్రాలు కూడా ఇచ్చారు. చివరకు ఎవరూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించకపోవడంతో తాజాగా తమదైన రీతిలో నిరసన తెలిపారు.
గ్రామస్తులందరూ ఏకమై దొత్తి వాగు నీళ్ళలో మోకాళ్లపై కూర్చొని నిరసనకు దిగారు. కావాలి.. కావాలి మాకు రోడ్డు కావాలి అని.. మా ఊరికి రోడ్డు కావాలంటూ నీళ్లలో మోకాళ్లపై కూర్చొని నినాదాలు చేసారు. యాపలగూడ గ్రామం ఏర్పడి దాదాపు 50 ఏండ్లు గడుస్తున్నా.. ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ మా బతుకులు మారడం లేదని, గతుకుల రోడ్డుతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం అని.. మా బతుకులు ఇకనైనా మారాలని దొత్తివాగులో నిరసన చేసారు. వచ్చే ఎన్నికల్లో మాకు రోడ్డు వేసేంత వరకు వేయబోమని నిరసన చేపట్టారు.
దొత్తివాగు చుట్టూ మూడు గ్రామపంచాయతీలు, 12 గ్రామాలు సుమారు 2500 మంది జనాబా కలరు. వీరు ప్రతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన నాయకులు వాగు బ్రిడ్జి గురించి చెబుతుంటారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్నికలు ముగిసిన తరువాత మరిచిపోతారని పేర్కొంటారు. వర్షాకాలం వచ్చిందంటే మా ఊరుతప్ప ఎటు వెళ్లలేక పోతున్నాంఅని.. పనులకు బయటకు వెళ్లితే.. వాగువచ్చిందంటే పెంబీలోనే పడుకుంటాం అని వెల్లడిస్తున్నారు. పిల్లలను చదువులకు పంపాలన్న కష్టంగా మారుతుందని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు గ్రామస్తులు. రోడ్డు లేకపోవడం వల్ల కొంతమంది ఆడపిల్లలకు పెండ్లిలు కూడా కావడం లేదని, మా గ్రామంలోని మగపిల్లలకు ఆడపిల్లలను ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు.
వాగు వచ్చిన సమయంలో బాలింతలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్తితి దాపురిస్తున్నది. గ్రామంలో ఎవరికైనా జ్వరం, అనారోగ్యం వంటివి సంభవిస్తే మాత్రం దేవుడిపైనే భారం పెడుతున్నాం అని.. పలువురు మరణించిన వాఉ కూడా ఉన్నారని చెబుతున్నారు. వాగులో వరద సంభవించి కొట్టుకుపోయిన వారు కూడా ఉన్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మా గ్రామాలకు రోడ్డు మార్గం వేయకపోతే వచ్చే ఎన్నికలలో ఓటు వేయబోమని గ్రామస్తులందరూ ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.