బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మమతా షాక్...!
ఇప్పుడు తాజాగా ఈశాన్య భారతంలో సత్తా చాటేందుకు కూడా టీఎంసీ అధినేత్రి ప్లాన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. మేఘాలయాలో హస్తం పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ గూటికి చేరుకున్నారు. అలాగే కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా మమతాకు జై కొట్టారు. మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్న మేఘాలయా అసెంబ్లీలో 21 మంది సభ్యులతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే ఇప్పుటు మొత్తం 12 మంది నేతలు టీఎంసీలో చేరడంతో... ప్రధాన ప్రతిపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవతరించింది. 2023లో మేఘాలయాలో జరిగే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మమతా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తామంతా టీఎంసీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్కు లేఖ రాశారు. ఇకపై తమను టీఎంసీ సభ్యులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వంపై మాజీ సీఎం ముకుల్ సంగ్మా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీలో మమతా పర్యటిస్తున్న సందర్భంలోనే ఈ పరిణామం జరగటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.