క్రేజీ కామెంట్‌ చేసిన మంత్రి.. ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు..!

N ANJANEYULU
ఇటీవల రాజస్థాన్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్ర గూడా అతి కొద్ది స‌మ‌యంలోనే  వివాదంలో చిక్కుకున్నారు. మంత్రిగా నియమితులయ్యాక రాజేంద్ర‌ మొదటిసారి తన నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు.  అక్కడి ప్రజలతో  ఆయ‌న మమేకమై.. రహదారులను బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ బుగ్గలతో పోల్చారు. దీంతో  మంత్రి రాజేంద్ర కామెంట్స్ వివాదానికి దారి తీసిన‌ది. రాజస్థాన్ మంత్రి క్రేజీ కామెంట్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన‌ది. బాధ్యతగల మంత్రి పదవీలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిట‌ని పలువురు మండిపడుతున్నారు.
రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ న‌వంబ‌ర్ 21న త‌న క్యాబినేట్‌ను  పునర్ వ్యవస్థీకరించిన విష‌యం విధిత‌మే. నూత‌నంగా 15 మందికి క్యాబినేట్‌లో చోటు కల్పించారు సీఎం.  నూత‌న మంత్రి వ‌ర్గంలో  రాజేంద్ర కూడా  ఉన్నారు.  పంచాయతీరాజ్‌శాఖ పోర్ట్‌ ఫోలియోను రాజేంద్ర‌కు కేటాయించారు.  అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గం అయిన  ఉదయ పూర్వాటిలో పర్యటించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తో స‌మావేశం అవుతూ ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించారు.
ఈ త‌రుణంలోనే  తమ గ్రామాల్లోని రహదారులు బాగు చేయాలని కొందరు  ప్ర‌జ‌లు మంత్రిని కోరారు. వెంట‌నే మంత్రి రాజేంద్ర  ప‌బ్లిక్ వ‌ర్క్స్‌ డిపార్ట్‌మెంట్ చీఫ్‌ ఇంజినీర్‌ వైపు చూస్తూ నా నియోజకవర్గంలో రహదారులు కత్రినా బుగ్గల్లా ఉండాలి అని సరదాగా  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. తొలిసారిగా కత్రినా కైఫ్‌ పేరుకు బదులుగా కేట్‌ కైఫ్‌ అని పేరును ప్ర‌స్తావించారు మంత్రి రాజేంద్ర‌.  త‌న  పక్కనున్న వారు కాస్త వారించడంతో  మ‌ర‌ల  కేట్ కైఫ్ కాకుండా కత్రినా కైఫ్‌ పేరును పలికారు. మంత్రిగారి మాటలకు అక్కడున్న ప్రజలు కొంత మంది చప్పట్లు కొట్టడం గమనార్హం. ఆయన కాస్త సరదాగా ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ సోషల్‌ మీడియాలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసార‌ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్ప‌టికే పలువురు మంత్రి రాజేంద్ర చేసిన  ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంత‌కు ముందే  బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. బిహార్‌ రోడ్లు హేమమాలిని బుగ్గల్లా నున్నగా ఉండాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి  వివాదంలో చిక్కుకున్న విష‌యం విధితమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: