చంద్రబాబుకు పోలీసు నోటీసులు... టీడీపీ నేతల ఆగ్రహం...!
ఇప్పుడు తాజాగా వరద ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో భారీ నష్టం సంభవించింది. ఈ జిల్లాల్లో బాధితులను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. నిన్న కడప జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత... రెండో రోజు చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాలను సందర్శించారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. తిరుపతి సమీపంలోని రాయల చెరువు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. రాయల చెరువు కట్ట తెగేందుకు సిద్ధంగా ఉందని... దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. దీంతో రాయలచెరువును పరిశీలించేందుకు చంద్రబాబు వెళ్లారు. అయితే చెరువు పరిసరాల్లో ఎలాంటి పర్యటనలకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. అనుమతి లేకుండా పర్యటించినందుకు చంద్రబాబుకు నోటీసులు అందించారు. ప్రస్తుతం రాయల చెరువు రెడ్ జోన్లో ఉందన్నారు పోలీసులు. చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు.