రెండు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం....!
రాష్ట్రంలో ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించేందుకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి పేర్ని నాని సభకు వివరించారు. సినిమా థియేటర్లతో రోజుకు నాలుగు షోలు మాత్రమే వేసేందుకు అనుమతి పొందిన ఎగ్జిబీటర్లు... ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రిలీజు రోజున ఆరు, ఏడు షోలు కూడా వేస్తున్నారని... అయితే ప్రభుత్వానికి పన్ను మాత్రం కేవలం నాలుగు షోలకు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఇక టికెట్లు కూడా బెనిఫిట్ షోల పేరుతో 500 నుంచి వెయ్యి రూపాయల వరకు టికెట్లు విక్రయించి ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం సినిమా హాళ్లలో జరుగుతున్న అక్రమాలకు ఆన్ లైన్ టికెట్ ప్రక్రియ మాత్రమే అడ్డుకట్ట వేస్తుందని ప్రభుత్వం భావించినట్లు పేర్ని నాని వెల్లడించారు. ఇదే విషయంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా సూచించారన్నారు. దీంతో సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేసినట్లు పేర్ని నాని వివరించారు.