వ్యక్తిగత సమాచారంపై కేంద్రం కీలక నిర్ణయం..!
దేశ భద్రత సందర్భంలో వ్యక్తిగత సమాచారాన్ని సహ దర్యాప్తు సంస్థలు అయిన పోలీసులు, రా, సీబీఐ, ఈడీ, ఐబీ, ఆధార్ కార్డులు ఇచ్చే ఉడాయ్, ఇతర ప్రభుత్వాలు కూడా వారి సమచారం తీసుకోవచ్చని ప్రతిపాదించింది. అయితే, తప్పుడు మార్గాల్లో సమాచారం తీసుకుంటే చిన్న కేసుల్లో అయితే రూ.5కోట్లు, లేదా ప్రపంచ వ్యాప్త టర్నోవర్లో 2 శాతం జరిమాన విధించే అవకాశం ఉంటుంది. పెద్ద కేసుల్లో అయితే రూ.15 కోట్లు లేదా ప్రపంచవ్యాప్త టర్నోవర్లో నాలుగు శాతం మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. 2017లో వ్యక్తి గత గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది సుప్రీం కోర్టు. అలాగే సమాచార పరిరక్షణకు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
ఈ మేరకు నిపుణుల సంఘం ఏర్పాటు చేసి బిల్లును రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2020 బడ్జెట్ సమావేశాలు ముగిసేసరికి నివేదిక సమర్పించాల్సి ఉన్నా కాలపరిమితి పొడిగించారు. ఈ బిల్లులోని పలు అంశాలతో విభేదిస్తూ కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు లేఖ రాశారు. అయితే, తాజా బిల్లుతో వ్యక్తిగత సమాచారం ఎవరి దగ్గరకు వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంది. వాస్తవానికి 90 శాతం దేశాల్లో వ్యక్తిగత గోప్యతను ఉంచేందుకు పకడ్భందీగా రూల్స్ అమలవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ పర్చకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా వ్యక్తిగత సమాచార బిల్లును తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లును మరింత పటిష్టంగా రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.