విజయగర్జనకు సన్నద్ధం కావాలి.. నేతలతో కేటీఆర్ భేటీ...
హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రోజుకు 20 నియోజకవర్గాల చొప్పున పార్టీ నాయకులతో భేటీ అవుతున్నారు. బుధవారం మూడవ రోజు ఈ భేటీ కొనసాగుతుంది. ముఖ్యంగా అక్టోబర్ 25న నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ సమావేశం, వరంగల్లో నవంబర్ 15 విజయగర్జన సభకు సిద్ధం కావాలని.. మంత్రి పిలుపు ఇచ్చారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఏర్పడి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వరంగల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు కేటీఆర్.
ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే వారందరూ గులాబీ రంగు దుస్తులను ధరించేవిధంగా చూడాలని చెప్పారు. ప్రతీ డివిజన్ కూడ గులాబీమయం కావాలని.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడాలి అని.. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉండాలని వెల్లడించారు. జిల్లాల నుండి నగరానికి వచ్చే అతిథులు, ప్రజాప్రతినిధులకు స్వాగత ఏర్పాటు చేయాలని వివరించారు.వరంగల్లో నిర్వహించే విజయగర్జకు అక్టోబర్ 27న ప్రతి నియోజకవర్గం వారిగా సమావేశాలు నిర్వహించుకోవాలి అని సూచించారు. అందుకోసం బస్సు సౌకర్యాన్ని కూడ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్లీనరీ తరువాత పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు కూడ ఉంటాయని వివరించారు.
ఇప్పటికే దాదాపుగా 40 నియోజకవర్గాల పార్టీ నేతలతో భేటీ అయ్యారు కేటీఆర్. వరుసగా మూడవరోజు తెలంగాణ భవన్లో ఈ భేటీ కొనసాగుతున్నది. పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలపై పార్టీ కీలక నేతలతో చర్చిస్తున్నారు. ఇప్పటివరకు మహేశ్వరం, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, ఇబ్రాహీంపట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గం కీలక నేతలతో భేటీ అయ్యారు బుధవారం. మధ్యాహ్నం సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం, కొత్తగూడం, అశ్వరావుపేట, భద్రాచలం, పినపాక, ఇల్లందు, వైరా, ఆలేరు, మధిర నియోజకవర్గం నేతలతో భేటీ కానున్నారు.