శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని ఎలా అయినా తన ఖాతాలో వేసుకోవాలన్న యోచనలో ఉన్నాడు జగన్. అందుకు తన ఎత్తుగడలు ఇప్పటి నుంచే వేస్తున్నాడు. గతంలో ఇలాంటివేవో చేసినా కూడా సఫలీకృతం కాలేకపోయాడు జగన్. వాస్తవానికి అచ్చెన్న అంటే కోపంతో జగన్ ఊగిపోయినా రామూపై మాత్రం పెద్దగా వ్యాఖ్యలు చేయడు. అదేవిధంగా వైసీపీ లో చాలా మంది యువ నాయకులు వారి అనుచరులు రామూకు అభిమానులు. అందుకనో ఎందుకనో ఈ సారి తన స్ట్రాటజీ మార్చాడు జగన్.
వచ్చే ఎన్నికలకు సంబంధించి జగన్ కొన్ని ప్రణాళికలు రాస్తున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తన తోటి వారిని ప్రోత్సహి స్తూ నిరంతరం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకాకుళం ఎంపీ స్థానంపై జగన్ కన్నేశాడు. తన వారిని అప్రమత్తం చేశాడు. ఇప్పటికీ రెండు సార్లు శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకోలేకపోయింది. అందుకే ఈ సారి కుల సమీకరణలతో కొట్టాలని చూస్తున్నాడు. బలమైన అభ్యర్థి, వివాదాలకు తావివ్వని ఎంపీ రామూ పై అంతే స్థాయి లో మరో బలమైన శక్తిని అదే సామాజికవర్గంకు చెందిన ధర్మాన కృష్ణ దాసు (ప్రస్తుత నరసన్నపేట ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, జగన్ వీర విధేయుడు) ను రంగంలో దింపాలని చూస్తున్నాడు. ఒకే సామాజికవర్గంతో పాటు రామూ, దాసన్న దగ్గరి బంధువులు. ఈ విధంగా కుటుంబంలో చీలిక తెచ్చి తన మాట నెగ్గించుకోవాలని చూస్తున్నాడు జగన్.
వాస్తవానికి ఇక్కడ గెలవడం అన్నది అంత సులువు కాదు. ఎంపీ రామూ చాలా బాగా పనిచేస్తున్నాడు. దాసన్న కన్నా సమర్థుడు. ఢిల్లీ పరిణామాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. యువతరంలో మంచి క్రేజ్ ఉన్నవాడు. ఎవరు ఏ పని చెప్పినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తాను చేయగలిగితే తప్పక చేస్తానని చెప్పి, ఎందరికో అండగా నిలిచాడు. ఎంపీ రామూ చిన్నవాడే అయినా చాలా చాలా పరిణితి ఉన్నవాడు. రాజకీయాల్లో శత్రువులు పెద్దగా లేని వాడు. ఆ మాటకు వస్తే జగన్ పార్టీలోనే కాదు టీఆర్ఎస్ పార్టీలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే రేపటి వేళ తారక్ ఒకవేళ ప్రచారానికి రానని మొండికేస్తే టీడీపీకి స్టార్ క్యాంపైనర్ కింజరాపు రామ్మోహన్ నాయుడే! ఇవన్నీ ఆలోచించే జగన్ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడని అంచనా వేస్తున్నారు అంతా!