తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ నాయకులు చెల్లా చెదురయ్యారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఘర్ వాపసి పేరుతో ఆనాయకులందరిని తిరిగి హస్తం గూటికీ చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుత టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కలిసారు రేవంత్ రెడ్డి. ఈ మధ్య కాలంలో ఆయన జారి కిందపడడంతో గాయపడ్డ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఆయనను పరామర్శించాడు. ఇలా పరామర్శించడానికి వెళ్లి అన్ని మాట్లాడుకుని వచ్చినట్టుగా సమాచారం.
ఇక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్ వైఎస్ఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగిన నేత అనే చెప్పాలి. అలాగే ఆయనకు సమకాలికుడు అని పేరు కూడా ఉంది. అలాంటి డీ.ఎస్ రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి జీవం లేకపోవడంతో తప్పనిపరిస్థితుల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు రాజ్యసభ సీటును కూడా ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇక ఆయన పదవీ కాలం ఇంకో ఆరు నెలల్లో ముగిసిపోనుంది.
దీంతో అక్కడి నుంచి మూడు నెలల ముందే జారుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఇందుకు తగ్గట్టుగా తమ సీనియర్ సహచరుడిని సంప్రదిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి కూడా వచ్చి రాగానే అందరినీ పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నాడు. కానీ, ముందు పార్టీపై పట్టు సాధించాక మిగతావారిపై ఫోకస్ పెట్టెటట్టు తెలుస్తోంది. ఇక ఆ సమయం వచ్చినట్టు తెలుస్తోంది. మొట్టమొదటి సారిగా రేవంత్ రెడ్డి డి.శ్రీనివాస్ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరితే వలసలు ఆగవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, డి.ఎస్ రావడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. ఆయన పెద్ద కొడుకు సంజయ్ రాజకీయంగా వెనకబడి పోయాడు అతన్ని ఎలాగైన రాజకీయాల్లో కీలకం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి డి.ఎస్ కాంగ్రెస్ గూటికి వెళ్తాడా లేదా అనేది చూడాలి.