వైఎస్ జగన్కు సొంత జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ..!
కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న నేత డీఎల్ రవీంద్రారెడ్డి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి కడప జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొద్ది కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ... మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి గెలుపు కోసం డీఎల్ పని చేశారు కూడా. ఎన్నికల తర్వాత డీఎల్ రవీంద్రారెడ్డి ఎక్కడా కనిపించలేదు. సరైనా ప్రాధాన్యత లేకపోవడంతో... ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన డీఎల్... ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని డీఎల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కౌలు చేసేందుకు కూడా రైతులు ముందుకు రావడం లేదన్నారు. ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశారు డీఎల్. ప్రతి శాఖ విషయంలో కూడా బయట వ్యక్తుల పెత్తనం ఎక్కువగా ఉందని ఆరోపించారు. ప్రస్తుతం డీఎల్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో హాట్ హాట్గా మారాయి.