కృష్ణా జిల్లా మంత్రులు వారేనా...!
ప్రస్తుతం కృష్ణా జిల్లా నేతల పరిస్థితి ఇలానే ఉంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు కోసం ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. జగన్కు అత్యంత ఆప్తుడుగా పేరున్న కొడాలి నానితో పాటు మరో నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కేబినెట్లో కొనసాగుతున్నాడు. అయితే... ప్రస్తుత మంత్రివర్గ మార్పులో వెల్లంపల్లి శ్రీనివాస్పై వేటు తప్పదని అంతా భావిస్తున్నారు. ఆయన స్థానంలో విజయవాడ నగరానికే చెందిన మరో నేత మల్లాది విష్ణుకు అవకాశం ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అందులో భాగంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి విష్ణును తప్పించారనేది నేతల మాట. అలాగే మరో సీనియర్ నేత కొలుసు పార్థసారథి కూడా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా గుర్తింపున్న పార్థసారథి... ఆయన కేబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు పదవి దక్కుతుందని ఆశ పడ్డారు. కానీ టీటీడీ బోర్డు మెంబర్తో సరిపెట్టారు జగన్. దీనిపై అప్పట్లోనే కొలుసు వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే రెండో విడతలో తప్పకుండా అమాత్య పదవి దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు పార్థసారథి. జిల్లాలో ఈ ఇద్దరు నేతలకే బెర్తు ఖరారైనట్లు ఇప్పటికే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.