గుడివాడ చుట్టూనే రాజకీయం..!
అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అంటున్నారు కొడాలి నాని. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి గుడివాడలో సరైన నాయకుడు లేడనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు తేల్చి చెప్పాడు. 2019 ఎన్నికల్లో బాలకృష్ణ స్వయంగా గుడివాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే బాలయ్య మాత్రం.. తన నియోజకవర్గం హిందూపురం వదిలి బయటకు రాలేదు. దీంతో దిక్కులేని పరిస్థితుల్లో విజయవాడ నుంచి దేవినేని అవినాష్ను గుడివాడకు పంపారు చంద్రబాబు. ప్రచారంలో పర్లేదనిపించిన అవినాష్.. ఓట్లు రాబట్టడంలో విఫలమయ్యాడు. ఎన్నికల్లో ఓటమి తర్వాత... ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా మళ్లీ విజయవాడ వెళ్లిపోయి... అధికార వైసీపీకి మద్దతు తెలిపారు. దీంతో ప్రస్తుతం గుడివాడలో తిరుగులేని నేతగా మారారు కొడాలి నాని. ఈ పరిస్థితుల్లో నానిని ఢీ కొట్టాలంటే... అందుకు సరైన వ్యక్తిగా వంగవీటి రాధాను ఎంపిక చేశారు చంద్రబాబు. టార్గెట్ 2024 అంటూ ఓ భారీ ప్రణాళిక రూపొందించిన చంద్రబాబు... అందులో భాగంగా రెండున్నరేళ్ల ముందే వంగవీటి రాధాను గుడివాడకు పంపేశారు. ఇద్దరు మిత్రుల మధ్య రాజకీయ యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి మరి.