శ్రీకాకుళం వార్త : ఎర్రన్న భక్తుడికి వైసీపీలో కీలక పదవి ?
జెడ్పీ పీఠం ఎవరిది అన్నది తేలిపోయింది. ఎటువంటి కొట్లాటకు తావివ్వకుండానే తేలిపోయింది. ఈ నిర్ణయం వెనుక ఉన్నది జగన్ మాత్రమే! ఆయనను దాటి ఎవ్వరూ ఏ నిర్ణయం తీసుకోలేరన్నది వాస్తవం. గత ఎన్నికల్లోనూ ఈ ఎన్నికల్లోనూ ఓ విధంగా ఎర్రన్న భక్తులకే జెడ్పీ పీఠం. అప్పుడు ఎర్రన్నాయుడు కీలక అనుచరుడిగా పేరున్న చౌదరి బాజ్జి భార్య చౌదరి ధనలక్ష్మి కి జెడ్పీ పీఠం వరించగా, ఈ సారి ఎర్రన్న ఆత్మబంధువు అన్నంత పేరు తెచ్చుకున్న పిరియా సాయిరాజు భార్య పిరియా విజయకు జెడ్పీ పీఠం వరించింది. ఆ విధంగా శ్రీకాకుళం జెడ్పీ పీఠంపై ఎర్రన్నాయుడి ప్రభావం సుస్పష్టం అని తేలిపోయింది.
విశాఖలో కాంట్రాక్టరుగా ఉన్న పిరియా సాయిరాజు ఇటుగా వచ్చేందుకు కారణం ఎర్రన్నాయుడు. తెలుగుదేశం పార్టీ లో తనకంటూ మంచి హవా లో ఉన్న రోజుల్లో నాయుడు గారు ఈయనను ప్రోత్సహించి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యేను చేశారు. ఆవిధంగా ఆయన 2009 - 14 మధ్య ఎమ్మెల్యే గా పనిచేశారు. ఈయన స్వస్థలం కవిటి మండలం బల్లిపుట్టుగ. ఎర్రన్నతో అనుబంధం కారణంగా కడదాకా ఆయనతోనే స్నేహం సాగించారు. ఆయన మరణం తరువాత వైసీపీకి వచ్చారు. వైసీపీలోనూ మంచి పేరు తెచ్చుకున్నా రు. ఇచ్ఛాపురంలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి తన సొంత సామాజిక వర్గం అయిన కాళింగ సామాజికవర్గ నేత బెందాళం అశోక్ చేతిలో ఓడిపోయారు. ఇంతటి ప్రాభవంలోనూ ఆయన ఓటమి వైసీపీని ఆశ్చర్యానికి గురి చేసింది.
టీడీపీ లీడర్ అశోక్ తనకు తిరుగేలేదని నిరూపించారు. విచిత్రం ఏంటంటే ఎన్నికలకు ముందు అశోక్ అనేక వివాదాల్లో ఉన్నారు. అయినప్ప టికీ ఆయన గెలుపు సునాయాసం అయింది. తాజా ఫలితాల నేపథ్యంలో మళ్లీ కాళింగ సామాజిక వర్గం బలమే వైసీపీ తరఫున నిరూపణ అయింది. దీంతో పిరియా విజయ 18699 మెజార్టీతో గెలుపొందారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు గెలిచిన అభ్యర్థులంతా జగన్ ఛార్మింగ్ ను ఉపయోగించుకునే గెలిచారు అని అనడం అంత సమజసం కాకపోయినా ఆయన ప్రభావం మాత్రం లేదనలేం.