సీఎం ఖజానాకే .. చిల్లు ..
తాజాగా ఏసీబీ సచివాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయానిధులను తప్పుగా వినియోగిస్తున్నట్టు తేల్చింది. దీనిలో సచివాలయ సిబ్బంది సహా పలువురు పెద్దల పిఎ లు, వాళ్ళ అనుచరులు ఉన్నట్టు తెలుస్తుంది. వీరు సచివాలయంలో లబ్ధిదారుల డాటాను అడ్డుపెట్టుకొని లేనిపోని అవసరాలను సృష్టించి ముఖ్యమంత్రి సహాయనిధులను కాజేస్తున్నట్టు తేల్చింది ఏసీబీ. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితం సీఎంఆర్.ఎఫ్. అధికారులు పిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన ఏసీబీ కొందరు సచివాలయ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ, తప్పుడు దారులలో ముఖ్యమంత్రి సహాయనిధులను దారిమళ్లిస్తున్నట్టు తేల్చింది.
మే నుండి ఏసీబీ ఈ కేసుపై పలువురిని విచారణ చేస్తుంది. కొందరిని ఇప్పటికే విచారించగా, మరికొందరికి నోటీసులు ఇచ్చింది. అయినా వారు స్పందించక పోవడంతో మళ్ళీ తాజాగా విచారణకు సహకరించాలని నోటీసులు జారీచేసింది. విడతల వారీగా ఈ విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ చెపుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించలేదు. ఇందులో పలువురు నేతల వద్ద పనిచేసే వారి హస్తం ఉన్నట్టు ఏసీబీ తేల్చింది. వారి పేర్లు మాత్రం బయటకు రానీయడం లేదు, ఇంటిదొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే చందాన ఈ కేసు కూడా నీరుగారిపోతుందా లేక తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఏసీబీ మాత్రం కూలంకషంగా విచారణ చేస్తుంది.