జగన్ ఇలాకా : కోర్టు వాకిట తిరుపతి సమస్య ?
వివాదాలు కొత్తేంకాదు :
టీటీడీ హయాంలో ఎన్నో వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చాక అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల పెంపుపై తర్జన భర్జనలు నడుస్తున్నాయి. అదేవిధంగా కరోనా సాకుతో సాధారణ దర్శనాలు నిలిపివేశారని ఆరోపణ ఒకటి నడుస్తోంది. ఈవో జవహర్ రెడ్డి కొన్ని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. సప్తగిరి పత్రిక అకస్మాత్తుగా ఆపేసిన ఘటనలో ప్రభుత్వం మరోసారి విమర్శలు ఎదుర్కొంది. ఆఖరికి అక్టోబర్ నుంచి సప్తగిరి పత్రికను పునరుద్ధరించే అవకాశా లు ఉన్నాయని తెలుస్తోంది. ఇవేకాదు ఆధ్యాత్మిక సంస్థల్లో రాజకీయ జోక్యం పెంచేవిధంగా కొత్త పాలక మండలి ఉన్నందున సాధారణ పౌరులకు స్వామి దర్శనం అన్నది ఎలా సులువు అవుతుందన్న ప్రశ్న ఒకటి వినిపిస్తోంది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో బలపడేందుకు ఎంతో అయిష్టంగా చేపట్టిన ఈ పదవి కారణంగా ఆయన కాస్త అసహనంతోనే ఉన్నారు. వీటితో పాటు టీటీడీ ఇతర ఆలయాల అభివృద్ధికి చేయాల్సిన సాయం చేయడం లేదు. జిల్లాలలో అన్నమయ్య సంకీర్తనా స్రవంతి పేరిట నిర్వహించే ప్రాజెక్టు నిలిపివేసింది. వీటితో పాటు వ్యయ నియంత్రణ అన్నది ఆలయ పరిధిలో లేదు అని కూడా తేలింది. కొన్ని సందర్భాల్లో టీటీడీ నుంచి కొంత డబ్బులు ప్రభుత్వం రుణ రూపేణా తీసుకోవాలని భావించి, భంగపడింది. అదేవిధంగా స్వామి నగలు తాకట్టు పెట్టి రుణాలు తేవాలనీ యోచించింది. ఇవేవీ అమలుకు నోచుకోలేదు అని ఊపిరి పీల్చుకోవడం మినహా సాధించేదేమీ లేదు.