మరో వివాదంలో జగన్ : ఒడిశా మాట వినదు ?
ట్రైబ్యూనల్ చెబుతున్నా, సర్వోన్నత న్యాయ స్థానం చెప్పినా ఒడిశా మాత్రం తన పనేదో తాను చేసుకుని పోతోంది. వరదల సమయంలో చెప్పాపెట్టకుండా దిగువకు నీరు విడుదల చేసే ఒడిశా, ఈ సారి కూడా తన పంథాను అలానే కొనసాగిస్తోంది. దీంతో శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టుకు అనుబంధంగా కట్టబోయే నేరడి బ్యారేజీ పనులపై సందిగ్ధత నెలకొంది. బ్యారేజీ కడితేనే వంశధార ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు సాధ్యం అని నిపుణులు చెబుతున్నారు.
సరిహద్దు వివాదాల్లో జగన్ మళ్లీ చిక్కుకున్నారు. ఒడిశాకు ఆంధ్రాకు సంబంధించి నేరడి బ్యారేజీ వివాదం ఒకటి నడుస్తోంది. బ్యారేజీ నిర్మాణం మంచిదేనని, న్యాయ విరుద్ధం కాదని ట్రైబ్యూనల్ తీర్పు ఇచ్చినా అవేవీ పట్టించుకోకుండా ఒడిశా తన దారేదో తానే చూసుకుంటుంది. దీంతో అంతరాష్ట్ర వివాదాలు కొలిక్కి రావడం లేదు. 106 ఎకరాల భూమిని బ్యారేజీ నిర్మాణానికి సేకరించి ఒడిశా ప్రభుత్వం ఏపీకి ఇవ్వాలని గతంలో ట్రైబ్యునల్ చెప్పింది. అంతేకాకుండా పరిహారం ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుందని కూడా చెప్పింది. ఇవేవీ పట్టించుకోకుండా నేరడి బ్యారేజీ నిర్మాణంపై సహకరించకుండా కొత్త ఎత్తుగడ వేసింది. ఎగువన ఉన్న పాణి డొంగరొ వద్ద ప్రాజెక్టు సహా మెగా ఎత్తిపోతల పథకాలు, చిన్న చిన్న పథకాలు నిర్మాణానికి సమాయత్తం అవుతోందని ప్రముఖ మీడియా చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం అనుకున్నా సరే తాము నిర్మించాలనుకున్న ప్రాజెక్టుల నిర్మాణం అన్నది చేసి తీరుతామని ఒడిశా చెబుతోంది. ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకుని, పావులు కదుపుతోంది. దీంతో ఎగువ నీరును ఎగువునే అడ్డుకుని దిగువకు విడిచి పెట్టక తన పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టుకు అను సంధానంగా నిర్మించే నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఇప్పుడిక అవాంతరాలు తప్పవు. వాస్తవానికి బ్యారేజీ నిర్మాణం విషయమై ట్రైబ్యునల్ అనుకూలంగా ఉన్నా కూడా ఒడిశా మాత్రం అస్సలు ముందడుగు వేయడం లేదు. ఫలితం ప్రాజెక్టు పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి.