వైసీపీ ఈ వాపుని బలుపు అనుకుంటే చిక్కులు తప్పవా..?
ఇక తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో అదిరిపోయే మెజారిటీతో గెలిచింది. తాజాగా ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో దుమ్ము లేపింది. ఏపీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వైసీపీ ఈ విజయాలని సాధించింది. అంటే ఏపీలో ఇంకా వైసీపీ తిరుగులేదని ఆ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలంతా వన్సైడ్గా తమ పక్షాన ఉన్నారని, జగన్ లైఫ్ టైమ్ సిఎంగా కొనసాగనున్నారని చెబుతున్నారు. చంద్రబాబు పని అయిపోయిందని, ఆఖరికి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరని మాట్లాడుతున్నారు.
అయితే వైసీపీ నేతలు చెప్పే మాటలు నిజమేనా...ప్రజలంతా జగన్ వైపే ఉన్నారా...ఈ విజయాలు అన్నీ వాపు కాదు బలుపేనా అంటే...కాస్త కాదనే చెప్పొచ్చు. వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తి ఏ మేరకు ఉందో అది ఇప్పుడే బయటపడటం కష్టం. అలాగే విజయాలు ఖచ్చితంగా వాపే అని టిడిపి శ్రేణులు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ఎన్ని రకాల మార్గాల్లో వైసీపీ విజయం సాధించిందో జనాలకు బాగా తెలుసు.
అటు జనం కూడా గతంలో మాదిరిగా లేరని, వైసీపీ నేతలకు, వాలంటీర్లకు కూడా భయపడుతున్నారని, ఇప్పుడు వైసీపీని కాదని వేరే వాళ్ళకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో అని భయముందని, అందుకే ప్రజలు వైసీపీకే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అలా అని ఈ విజయాలన్నీ తమ మంచి పాలనకు నిదర్శనమని వైసీపీ నేతలు భావిస్తే...అంతకంటే మరో దరిద్రం లేదని అంటున్నారు. వాపుని చూసుకుని బలుపు అని ఫీల్ అయితే నెక్స్ట్ ఎన్నికల్లో చుక్కలు చూడటం ఖాతమని తమ్ముళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు.