కుప్పంలో చంద్రబాబుకు షాక్... ఇంత ఘోర అవమానమా ?
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. గతేడాది జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఊరించి ఊరించి ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ఈ రోజు వెలువడుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిపక్ష టీడీపీ ముందుగానే బహిష్కరించేసింది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల టీడీపీ నేతలు బలంగా ఉన్న చోట మాత్రమే ఆ పార్టీ పోటీ ఇచ్చిందే తప్పా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా కూడా వైసీపీ ఏకపక్ష విజయాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే పటు చోట్ల ఏకగ్రీవంగా పలు విజయాలు సాధించిన అధికార వైసీపీ ఈ రోజు కౌంటింగ్ లో ముందు నుంచి దూకుడుగానే ఉంది.
ఇక ఈ రోజు వెలువడుతోన్న పరిషత్ ఎన్నికల ఫలితాల్లో రికార్డు స్థాయిలో స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తోంది. టీడీపీకి మంచి పట్టున్న చోట్ల కూడా వైసీపీ తన ఆధిపత్యం చాటుకుంటోంది. విచిత్రం ఏంటంటే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనూ వైసీపీ దూసుకు పోతోంది. కుప్పంలోనూ ఇప్పుడు వైఎస్సార్సీపీ హవా స్పష్టంగా కనిపిస్తోందని వెలుడుతోన్న ఫలితాలు చెపుతున్నాయి.
కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం నమోదు చేసుకున్నారు. ఇక ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా కూడా టీడీపీ ఎక్కడా అడ్రస్ కూడా లేకుండా పోయింది. వైసీపీ పూర్తిగా వార్ వన్సైడ్ చేసేసింది. జిల్లాలో 65 జడ్పీటీసీలకుగానూ ఇప్పటికి 29 స్థానాలను .. 841కి ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 416 స్థానాలను కైవసం చేసుకుని దూసుకు పోతోంది. ఏదేమైనా చంద్రబాబు సొంత ఇలాకాలో వైసీపీ జోరు చూపిస్తుందంటే ఇది ఆయనకే ఘోర అవమానం అని చెప్పాలి.