తీవ్రమయిన నిరాశలో ఉత్తరాంధ్ర నాయకులు ఉన్నారు. ఈ క్రమంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. వయసు రీత్యా వారేమంత పెద్దవారు కాకపోయినా, ఇప్పటి పరిస్థితులలో తాము నెగ్గుకు రాలేదమని ఆవేదన చెందుతూ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ కోవలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచి చాలా నిరాశలో ఉన్నారు. అప్పుడప్పుడూ కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఆయనను ఇబ్బంది పెట్టాయి. ఈ తరుణంలో గతంలో ఓసారి తన సన్నిహితుల వద్ద చెప్పేశారు కూడా! వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని! దీంతో ఆయన స్థానంలో కుమారుడు చిన్ని (ధర్మాన రాం మనోహర్ నాయుడు) వస్తున్నారు. ఆయన ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు.
ఎందుకీ నిర్ణయం
ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ధర్మానను అభిమానించే వారు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రాలో రెవెన్యూ పదవి నిర్వహించారు. కొన్ని వివాదాలు రాజశేఖర్ రెడ్డి కారణంగానే చిక్కుకున్నారు. కొన్ని తన ప్రమేయం లేకపోయినా అనుచరుల కారణంగా వివాదాలకు తావిచ్చేయి. ఇవే కాకుండా ట్రైమెక్స్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపాన గార ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టడం, అదే విధంగా కొడుకు చిన్ని నడిపే వర్జిన్ రాక్స్ కోసం కన్నె ధార కొండ తవ్వకానికి అనుమతులు తెచ్చుకోవడం, అవి ఈనాడు బట్టబయలు చేయడంతో పెను వివాదాలు రేగడం ఇవన్నీ ధర్మాన పరపతిని తగ్గించేయి. ప్రతిష్టను దిగజార్చాయి. ఈ కోవలో ఆయన చాలా కాలం ఇంటికే పరిమితం అయ్యారు. దేశం పార్టీ హయాంలో తన సామాజిక వర్గానికే చెందిన గుండ లక్ష్మీ దేవి (వరుసకు చెల్లెలు) ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ఆమెకు సంబంధించి పెద్దగా ఆరోపణలు చేయలేదు. అలానే అచ్చెన్నాయుడి పైకూడా పెద్దగా ఆరోపణలు చేయలేదు. (దీనికీ ఒకే సామాజికవర్గమే ప్రధాన కారణం) తన కోపం అంతా చంద్రబాబుపైనే చూపించారు. ఆ క్రమంలోనే వివాదాస్పదం అయినప్పటికీ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు టౌన్ హాల్ ను ఎంచుకుని అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించారు. వైసీపీకి జిల్లా కేంద్రంలో పెద్ద దిక్కు అప్పట్లో ఆయనే!
తొలి రోజుల్లో ఆయన రాక ను జగన్ఇష్టపడక పోయినా తరువాత రోజుల్లో ఆయన యాక్టివ్ కావడంతో అధినేతకు ముందరి అభద్రత అన్నది తొలగిపోయింది. పార్టీని నడిపే క్రమంలో నిర్మాణ పరంగా కొన్ని పనులు చేసి, నిలిపే క్రమంలో నిరసనలు చేసి క్యాడర్ కు పెద్దదిక్కుగానే ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆయనకు ఏ పదవి రాలేదు. మంత్రి పదవి అన్నయ్యకు వరించింది. దాంతో దాసన్న మరింత యాక్టివ్ అ య్యారు. అప్పటిదాకా వైసీపీని నడిపిన జిల్లా అధ్యక్షుల్లో మొదటి వ్యక్తి దాసన్న భార్య పద్మ ప్రియా కృష్ణ దాస్. ఆ తరువాత పార్టీని ఇప్పటి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి నడిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒకప్పటి కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నడుపుతున్నారు. ఏదేమయినప్పటికీ ధర్మాన కృష్ణ దాసు మొదటి నుంచి వైసీపీ అడుగుల్లో అడుగుగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ (ధర్మాన సోదరులు) క్రియాశీలక రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుని కొడుకులను తెరపైకి తెస్తుండడం విశేషం. ఇప్పటికే దాసన్న కొడుకు కృష్ణ చైతన్య నరసన్నపేట కేంద్రంగా పార్టీ కార్యకలాపాల్లోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ, క్యాడర్ ను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు కుమారుడు కూడా కార్యాచరణను షురూ చేశారు. గత ఎన్నికల్లో నాన్న గెలుపునకు అన్నీ తానై కృషి చేశారు.