తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి. మొన్నటిదాకా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టింది. ఈ క్రమంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామంటే తాము అని చెప్పుకుంటున్న బీజేపీ - కాంగ్రెస్ సభలు, యాత్రలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సారిగా ఉవ్వెత్తున్న లేచింది. ఆ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నిండింది. దీంతో రేవంత్ టీఆర్ఎస్ పార్టీ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.
అదికారమే లక్ష్యం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నాడు. దళితబంధు పథకం అందరికీ అమలు చేయాలంటూ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో సభలను నిర్వహిస్తున్నాడు. మరోవైపు కేసీఆర్ అధికార విచ్చిత్తే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను మొదలు పెట్టారు. ఎవరూ ఊహించని రీతిలో బండి పాదయాత్రకు అనూహ్యంగా స్పందన వస్తోంది. పాదయాత్ర సాగుతున్న గ్రామాల నుంచి వందల మంది బీజేపీ లో చేరుతున్నారు.
పాదయాత్ర పూర్తయ్యే సరికి వేల సంఖ్యలో బీజేపీకి సైనికులు మారుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. ఆ పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నిర్మల్ ప్రాంతంలో సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా రానున్నారని అధికారికంగా ప్రకటించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
అలాగే రేవంత్ నాయకత్వంలో సాగుతున్న దళిత గిరిజన దండోరా సభను తెలంగాణ విమోచన దినం రోజైన సెప్టెంబర్ 17 న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాక గజ్వెల్ భారీ సభను నిర్వహించ తలపెట్టారు. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు కూడా. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ సభలతో అధికార టీఆర్ఎస్ పార్టీలో కాస్త అలజడి మొదలయినట్టు తెలుస్తోంది. ఈ సభ వేదిక ద్వారా కేసీఆర్ పాలనపై విమర్శానాస్త్రాలు సందించేందుకు సిద్దం అవుతున్నారు ఇరు పార్టీల నేతలు. అయితే, ఈ సభల ప్రభావం టీఆర్ ఎస్ పార్టీపై ఏమేరకు చూపుతుందో వేచి చూడాలి.