అమిత్ షా ఆ క్లారిటీ ఇస్తారా?
నిర్మల్ సభలో అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు అపాయింట్మెంట్ ఇవ్వటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ ఢిల్లీలో వారం రోజులకుపైగా మకాం వేసి వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలవడం వంటి పరిణామాలతో రాష్ట్ర బీజేపీ వర్గాల్లోనే అనుమానాలు రేకెత్తాయి. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టింది. బండి సంజయ్ పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విమర్శిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తున్న సమయంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, అమిత్షాలను కలిశారు. తెలంగాణ బీజేపీ నేతలు ఎన్ని మాట్లాడినా.. ఢిల్లీ స్థాయిలో బీజేపీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న సంకేతాలను కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీలు ఒకే తాను ముక్కలన్న ప్రచారం రాష్ట్రంలో జోరందుకుంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. అందుకే అమిత్ షా నిర్మల్ సభ ద్వారా టీఆర్ఎస్తో సంబంధాలపై క్లారిటీ ఇస్తారని కమలనాథులు భావిస్తున్నారు. నిర్మల్ సభకు మొత్తం లక్ష మంది వస్తారని బీజేపీ అంచనా వేస్తోంది.