కోవాగ్జిన్ ధరను కేటాయించిన భారత్ బయోటెక్.. ధర ఎంతంటే..?

N.ANJI
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ బాధితులతో ఆస్పత్రులు నిండుకుపోయాయి. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప.. ఆస్పత్రికి రావొద్దని సలహా ఇస్తున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, రిమిడెసివిర్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ తీవ్రతరం కావడం వ్యాక్సిన్ విడుదల చేయడానికి ఆయా టీకా తయారీ సంస్థలు వాటికి ధరలను నిర్ణయించాయి. టీకా తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ తర్వాత.. భారత్ బయోటెక్ కూడా టీకా ధరపై నిర్ణయం తీసుకుంది.
కోవాగ్జిన్ టీకాను రూ.600 మాత్రమే ఇవ్వనున్నట్లు భారత్ బయోటెక్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధర రూ.1200 ఉంటుందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.అల్లా తెలిపారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ చైర్మన్ మాట్లాడుతూ.. భారత్ బయోటెక్ సంస్థ తమ కంపెనీ టీకాను మోతాదుకు రూ.150 చొప్పున కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తోందని, కేంద్రం ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. దీని ఎగుమతి ధర రూ.1,123-1,498 మధ్య ఉంటుందన్నారు. సంస్థ యొక్క ఉత్పత్తి సామర్థ్యంలో సగానికి పైగా కేంద్ర ప్రభుత్వానికి టీకా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అలాగే కోవిడ్‌తోపాటు చికెన్ గున్యా, జికా, కలరా ఇతర ఇన్‌ఫెక్షన్లకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నామని వెల్లడించారు.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ కూడా తన ధరను ఇటీవలే వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు మోతాదుకు రూ.400, ప్రైవేట్ ఆస్పత్రులకు మోతాదుకు రూ.600 ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కేంద్రంతో చేసుకున్న టీకా ఒప్పందం ముగియడంతో సంస్థ ధరను నిర్ణయించింది. అయితే ఈ టీకాను కేంద్ర ప్రభుత్వానికి కూడా మోతాదుకు రూ.400 ఉంటుందని సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది. ప్రస్తుతం మరింత టీకా ఉత్పత్తి చేయాలి. దానికి బోలెడు ఖర్చు అవుతుందని, అందుకే టీకా ధరను నిర్ణయించడం జరిగిందని ఆయా టీకా తయారీ సంస్థలు పేర్కొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: