ప్రకాశం జిల్లాలో పరుచూరు నియెజకవర్గంలో అధికార పార్టీ కొద్ది రోజులుగా పడకేస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన చంద్రబాబు తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయాక జగన్ ఆయన్ను పక్కన పెట్టేసి తిరిగి ఎన్నికలకు ముందు వరకు ఇన్చార్జ్గా ఉన్న రావి రామనాథం బాబును పార్టీలోకి తీసుకుని ఇన్చార్జ్ను చేశారు. రామనాథం బాబు వల్ల వైసీపీకి ఏ మాత్రం ఒరగడం లేదు. పార్టీ అధికారంలో ఉండి.. ఆయన నియోజకవర్గ ఇన్చార్జ్గానే కాకుడా డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్నా పరుచూరులో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు దూకుడు ముందు వైసీపీ బేజారవుతోంది. తాజాగా ఏలూరు స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొన్ని చోట్ల వైసీపీ వాళ్లు నామినేషన్లు వేయలేన దుస్థితి నెలకొంది.
పర్చూరు గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప లాడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం గొనసపూడి పంచాయతీని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. తొలి ఏకగ్రీవ పంచాయతీగా గొనసపూడి చరిత్ర సృష్టించింది. సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు విక్రమ్ దీప్తి ఎన్నికయ్యారు. సర్పంచ్ ఉప సర్పంచ్ ను పదవులను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
మొత్తం 10 వార్డులకు గాను తెలుగుదేశం పార్టీ 6 వార్డులు, వైసీపీకి నాలుగు వార్డులు దక్కాయి. సర్పంచ్ ఉప సర్పంచ్ లతోపాటు పాలకవర్గానికి పర్చూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు పొద వీరయ్య, బత్తుల శ్రీనివాసరావు, విక్రమ్ నారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అభినందించారు.
మరో వైపు పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కూడా టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూకుడు చూపిస్తోంది. ఎమ్మెల్యే ఏలూరి మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలిపించుకునే క్రమంలో అభ్యర్థుల ఎంపిక లో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు విద్యావంతులు.. పార్టీ కోసం కష్టపడిన వారినే ఎంపిక చేస్తూ ఎన్నికలకు ముందే పై చేయి సాధిస్తున్నారు. దీంతో వైసీపీ అక్కడ విలవిల్లాడాల్సిన పరిస్థితి.