తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవల్లో కీలక ముందడుగు..!?
ఇక ఇప్పటికే రికార్డు రేంజ్ రెవిన్యూ సంపాదిస్తూ.. సేవల విషయంలో ప్రజల మన్ననలు అందుకుంటుంది. తాజాగా ఆర్టీసీ కార్గో మరో అడుగు ముందుకు వేసి ప్రయోగాత్మకంగా డిసెంబర్ 10 నుంచి పార్శిల్ డోర్ డెలివరీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ లో ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసు ద్వారా పార్శిళ్లు నేరుగా ఇంటి వద్దకే చేరనున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ… గత 3 నెలలుగా కొరియర్ పార్శిళ్ల సేవల్లో తెలంగాణ ఆర్టీసీ వేగవంతమైన వృద్ది సాధించిందన్నారు. తాజాగా ప్రారంభించిన డోర్ డెలివరీ సేవలను కూకట్పల్లి జేబీఎస్, ఎంజీబీఎస్ ప్రాంతాల నుంచి మూడు ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్గో పార్శిల్ హోమ్ డెలివరీ సేవలు హైదరాబాద్లో విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఇక హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు మంత్రి కేటీఆర్ సూచన చేసినట్లు వివరించారు.
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా పార్శిల్ కార్గో సేవలను ఆర్టీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. తక్కువ కాలంలోనే ఈ విధానం ప్రజలకు బాగా చేరువై..మంచి ఆదాయ వనరుగా మారింది. ఇతర కార్గో సేవలతో పోలిస్తే ఆర్టీసీ కార్గో సేవలు తక్కువ ధరకే అందుబాటులో ప్రజలకు కూడా సర్వీసెస్ వినియోగించుకుంటున్నారు. కార్గో డోర్ డెలివరీ సేవలకు కూడా ప్రజల నుంచి ఆదరణ లభించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించగలిగితే భవిష్యత్తులో ఆదాయం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.