తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. తన పాలనపై పూర్తిగా తన ముద్ర కనిపించేలా .. రాష్ట్ర రాజకీయాలే కాకుండా పాలన పరంగానూ తన దైన శైలి కొన్ని తరాల పాటు కనిపించేలా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఈ అడుగులే ఇప్పుడు వైసీపీ నేతలను కలవర పెడుతున్నాయి. తాజాగా జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆరు కీలకమైన బిల్లులు ప్రవేశ పెట్టారు.
దీనిలో ప్రధానంగా రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల్లోను, కాంట్రాక్టుల్లోనూ, వివిధ పదవుల్లోనూ మహిళలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50% సీట్లను రిజర్వ్ చేశారు. నిజానికి ఇది దేశంలో ఏ రాష్ట్ర మూ ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. మాది మహిళా సానుకూల ప్రభుత్వ మని పదేపదే చెప్పుకొన్న గత చంద్రబాబు ప్రబుత్వంలో కానీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కానీ ఎప్పుడూ ఈ త రహా ఆలోచనే చేయలేదు.
అంతెందుకు మహిళలకు 33% కోటా అమలుకు పార్లమెంటులో బిల్లు తెచ్చిన అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఎప్పుడూ ఇలాంటి ఆలోచనే చేయలేదు. కానీ, జగన్ మాత్రం ఇప్పుడు అనూహ్యంగా ఈ విషయంలో పెద్ద కీలక అడుగు వేశారు. ఇది రాజకీయంగా సంచలనం సృష్టించే విషయమే. ఈ బిల్లు ఆమోదం పొందితే.. ఇక, రాష్ట్రంలో ప్రతి మహిళా .. జగన్ పేరు తలుచుకోకుండా ఉండే ప్రసక్తే ఉండదు. అయితే, అదేసమయంలో ఈ పరిణామం వైసీపీలో ఇబ్బందికరంగా మారింది. వైసీపీలోని కీలక నాయకులు ముఖ్యంగా జగన్ సామాజిక వర్గానికి చెందిన నేతలు బోలెడు మంది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. తమ వాడు వచ్చాడు..తమకేదైనా చేస్తాడు అని వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే పలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు కోటా-గీటా అంటూ.. జగన్ లేని విషయాన్ని తలకెత్తుకోవడంతో వారు తల్లడిల్లుతున్నారు. మొత్తం పదవులన్నీ మహిళలకే దోచి పెడితే.. తమ పరిస్థితి ఏంటని వారు లోలోన కుంగిపోతున్నారు. మహిళలకు పదవులు ఇవ్వాల్సిందే.. కానీ, ఇలా మొత్తంగా 50% ఇస్తే.. తమ గతేంటని వారు ప్రశ్నిస్తున్నారు.