నాలుగేళ్ల కష్టం.. అది కూడా రోజుకు 18 గంటలు. అంతేనా.. విభజనతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్న, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలో పాలన. కేంద్రం నుంచి అందుతుందనుకున్న ఆర్థిక సాయం.. మొండి చేయిగా పరిణమించడం, రాష్ట్రంలో ప్రజల కోరికలు పెరగడం, సమస్యలు విజృంభించడం ఈ నేపథ్యంలో ఏపీలో పాలన అంటే.. మామూలు విషయం కాదు. అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాను పడుతున్న కష్టానికి ఓట్ల రూపంలో విలువ కట్టాలని.. ప్రజల నుంచి తాను ఆశించే కూలి కూడా ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా తనతండ్రికి కూలి కింద ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఇక, ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. ``మీరు ఎవరికి ఓటెత్తుతారు?!`` అంటూ ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ప్రజల మధ్యకు వచ్చారు.
రాష్ట్రంలో టీడీపీకి అనుకూలంగా ఉన్న 15 నియోజకవర్గాలు, ప్రతికూలంగా ఉన్న 3 నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. మరి ఈ క్రమంలో నిత్య కృషీవలుడిగా తనను తాను చెప్పుకొనే చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన కూలి.. సగమే!! అదేంటి? అని ఆశ్చర్య పోతున్నారా?! సర్వేలో 53% మంది ప్రజలే చంద్రబాబు పనిచేస్తున్నాడని చెబుతున్నారు. మరి మిగిలిన వారు.. ఆయన మాటలు చెబుతున్నారని సర్వే ప్రతినిధులకు మొహమ్మీదనే చెప్పేశారట.! ఈ పరిణామం నిజంగా చంద్రబాబుకు శరాఘాతంగానే పరిణమిస్తోంది. ఇక, ఇన్నాళ్లుగా చంద్రబాబు యాంటీ ప్రచారం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ విషయంలో ప్రజలు బాబు మాటలకు పెద్దగా విలువ ఇస్తున్నదీ ఎక్కడా కనిపించడం లేదు. దాదాపు 47% మంది ప్రజలు జగన్కు జై కొడుతున్నారు.
వాస్తవానికి చంద్రబాబు అండ్కో లెక్కల ప్రకారం.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం అధినేత బాబు తీవ్రంగా శ్రమిస్తు న్నారు. అనేక దేశాలు తిరిగి.. అమరావతిని ప్రపంచ పటంలోనిలిపేందుకు కృషి చేస్తున్నారు. నీరు-మట్టి అంటూ వివిధ ప్రాంతాల నుంచి సెంటిమెంటు వాటర్ తెప్పించి శంకుస్థాపన చేశారు. ఇక, నిరుద్యోగ భృతిని రేపో మాపో ఇవ్వనున్నారు. కాపులకు కోట్లు కుమ్మరించి కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేస్తున్నారు. త్వరలోనే అన్నక్యాంటీన్లు ప్రారంభించనున్నారు. ఇక, ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వారికి కూడా లబ్ధి కలిగేలా గత బడ్జెట్ 75 కోట్లు కేటాయించారు.
రుణమాఫీ.. రైతులకు, డ్వాక్రా మహిళలకు కూడా చేస్తున్నారు. చంద్రన్న బీమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా దూసుకుపోతున్న చంద్రబాబుకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. పెరగనున్న సీట్ల సంఖ్య కేవలం 8. అదేసమయంలో వైసీపీ జరిగే నష్టం .. జీరో!! మరి దీనిని బట్టి.. బాబు పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పేదేముంది. అయితే, గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్టుగా.. తిరిగి అధికారం మాత్రం బాబుకు దఖలు పడడం ఒక్కటే ఈ సర్వే నుంచి బాబుకు లభించిన ప్రత్యేక సాంత్వన!!