ఉత్తరాంధ్ర : మంచి అవకాశాన్ని పవన్ చేజార్చుకున్నారా ?
మంచి అవకాశాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోగొట్టుకున్నారు. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి పవన్ గనుక హోటల్ బయటకు వచ్చుంటే కథ వేరేవిధంగా ఉండేది. అలాగే అరెస్టయిన కార్యకర్తలకు సాంఘీభావంగా వాళ్ళని ఉంచిన పోలీసుస్టేషన్ దగ్గరకు వెళ్ళుంటే కథ ఇంకోరకంగా ఉండుండేది. ఆంక్షలను ఉల్లంఘించి నేరుగా రోడ్లపైకి వెళ్ళిపోవాలి. లేదా కనీసం హోటల్ బయటకు వచ్చి రోడ్డుపైనైనా నిరసన వ్యక్తంచేసుండాల్సింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చెప్పటానికి అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను వదిలేసుకుని హోటల్ గదిలోనే కూర్చుండిపోయారు. గదిలో కూర్చునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లుపెట్టడం, పోన్లో ఇతరపార్టీల నేతలతో మాట్లాడటం తప్ప పవన్ 24 గంటలు చేసిందేమీలేదు. చివరకు చేసేదేమీ లేక హోటల్ గది నుండి నేరుగా ఎయిర్ పోర్టు చేరుకుని అక్కడి నుండి గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయి మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు.
ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించటం, జనాల మద్దతును కూడగట్టడం, ప్రజల్లోకి చొచ్చుకుపోవటమే ప్రతిపక్షాల నేతలు చేయాల్సిన పని. కానీ పవన్ మాత్రం అందుకు ఉల్టాగా చేసి మంచి అవకాశాన్ని చెడగొట్టుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రుల కార్లపై దాడులుచేసింది జనసైనికులే అన్న విషయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. మంత్రులపై దాడికి తమకు ఎలాంటి సంబంధంలేదని ఎంత బుకాయించినా చేసిందెవరో జనాలందరికీ తెలుసు.
పోలీసులు కూడా దాడులకు సంబందించి సీసీ కెమరాలో రికార్డయిన దృశ్యాలను ఆధారం చేసుకుని నిందితులను గుర్తించి కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కాబట్టి దాడులకు తమపార్టీకి ఎలాంటి సంబంధంలేదని పవన్ ఎంతచెప్పినా ఎవరు నమ్మరు. అయినా కానీ తన అడ్డదిడ్డమైన వాదనతో పవన్ జనాల్లోకి వెళ్ళిపోయుండాల్సింది. ఎందుకంటే వాస్తవాలతో సంబంధంలేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడటం పవన్ కు బాగా అలవాటైన విద్యేకదా. మంత్రులపైన దాడి కారణంగా ప్రజాగర్జన అంశం మరుగునపడిపోయింది. అలాగే పవన్ గనుక ధర్నాయో లేదో నిరసనో చేసుంటే తాజా డెవలప్మెంటే సంచలనంగా మారేది. అయితే తనపైన కేసు నమోదవుతుందని, అరెస్టవుతానని పవన్ వెనక్కు తగ్గుంటారు.